డీజిల్‌ ధర తగ్గినా మారని సరుకు రవాణా ఖర్చు | Sakshi
Sakshi News home page

డీజిల్‌ ధర తగ్గినా మారని సరుకు రవాణా ఖర్చు

Published Fri, Apr 12 2024 12:08 PM

Truck Rentals Were Stable As Corporates Rushing In March - Sakshi

సరుకు రవాణా ధరలు మార్చి 2024లో ఫ్లాట్‌గా ఉన్నాయని శ్రీరామ్ ఫైనాన్స్ నెలవారీ లాజిస్టిక్స్ పరిశోధన నివేదిక శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్ తెలిపింది. గౌహతి-ముంబై ట్రిప్ మినహా మెజారిటీ రూట్లలో పెరుగుదల కనిపించలేదని చెప్పింది. ఈ మార్గంలో రవాణా ధరలు 1.1 శాతం పెరిగాయని పేర్కొంది. 

మరోవైపు దిల్లీ-కోల్‌కతా, దిల్లీ-చెన్నై, దిల్లీ-బెంగళూరు, ముంబై-కోల్‌కతా ట్రిప్‌ల్లో రవాణా ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీ-కోల్‌కతా మార్గంలో గరిష్టంగా 1.4 శాతం ధరలు తగ్గినట్లు నివేదిక తెలిపింది. అందులోని వివరాల ప్రకారం..ఆల్ ఇండియా వెహికల్ రిటైల్ అమ్మకాలు ఫిబ్రవరిలో 20.29 మిలియన్ యూనిట్లతో పోలిస్తే మార్చిలో 21.27 మిలియన్ యూనిట్లు పెరిగాయి. ఈ విభాగంలో 4.81 శాతం వృద్ధి నమోదైంది. ఇది మార్చి 2023లో నమోదైన 20.62 మిలియన్లతో పోలిస్తే 3.14 శాతం ఎక్కువ.

ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం

ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నెల కావడంతో కార్పొరేట్ సంస్థలు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త అధికంగా సరుకు రవాణా చేయడంతో ట్రక్కుల అద్దెలు స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి చివరి వరకు ఇంధన ధరలు తగ్గాయి. ఫిబ్రవరి 28న దిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు రూ.89.62 ఉండగా, మార్చి 31న లీటరుకు రూ.87.62 పడిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు మార్చి 15న లీటరుకు రూ.2 చొప్పున ఇంధన ధరలను తగ్గించాయి. అయినా ట్రక్కు అద్దె ధరలు, రవాణా ధరల్లో ఎలాంటి మార్పు లేదని నివేదిక ద్వారా తెలిసింది.

Advertisement
Advertisement