Mark Zuckerberg Reaction On Allegations Over FB Profits Over User Safety - Sakshi
Sakshi News home page

పైసల కోసమే ఫేస్‌బుక్‌ కక్కుర్తి! ఛస్‌.. లాజిక్‌ లేదన్న మార్క్‌

Published Wed, Oct 6 2021 10:13 AM

Zuckerberg Denies Frances Haugen Allegations Over FB Profits Over Safety - Sakshi

ఫేస్‌బుక్‌ పంచాయితీ సెనెట్‌కు చేరిన క్రమంలో మాటల తుటాలు పేలుతున్నాయి. ఫేస్‌బుక్‌ మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ విజిల్‌ బ్లోవర్‌గా మారిపోయి.. ఫేస్‌బుక్‌ మీద సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ సైతం ఘాటుగా స్పందిస్తున్నారు. 



నెలకు మూడు బిలియన్ల మంది యూజర్లు ఉపయోగించుకునే ఫేస్‌బుక్‌ మీద మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. యూజర్‌ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు పరమావధిగా మారిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఫ్రాన్సెస్‌ హౌగెన్‌, ఇతరత్ర మీడియా కథనాలను కొట్టిపడేస్తున్నారాయన.



ఏమైనా అర్థం ఉందా?
లాభం కోసం ప్రజలను రెచ్చగొట్టే కంటెంట్‌ని మేం ఉద్దేశపూర్వకంగా ముందుకు తెస్తామనే వాదన చాలా అవాస్తవికమైనంటూ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ చేశారాయన.  ‘‘ ఆమె(ఫ్రాన్సెస్‌ హౌగెన్‌) మాట్లాడేదాంట్లో అర్థం లేదు. కంటెంట్‌ ద్వారా ప్రజలను రెచ్చగొట్టడం, వాళ్లను నిరాశలోకి నెట్టేయడమా?  బహుశా ఏ టెక్‌ కంపెనీ చేయదేమో. నైతిక విలువలు, వ్యాపారం.. పరస్సర విరుద్ధ అంశాలు. వాటిని ముడిపెట్టి విమర్శలు చేయడం లాజిక్‌గా అనిపించడం లేదు. ఫేస్‌బుక్‌ అనేది యాడ్స్‌ నుంచి డబ్బు సంపాదిస్తోందని ముందు నుంచి చెబుతున్నాం. అలాగే తమ యాడ్స్‌ జనాల్ని రెచ్చగొట్టేవిగానో, కోపం తెప్పించేవిగానో, వాళ్లకు హాని చేసివిగానో ఉండవని అడ్వటైజర్స్‌ సైతం చెప్తున్నారు. అలాంటప్పుడు ఆమె ఆరోపణలు.. ఆ ఆరోపణల ఆధారంగా వచ్చిన కథనాలు ఎలా నిజం అవుతాయి’’ అని మార్క్‌ ప్రశ్నిస్తున్నాడు.



కాంగ్రెస్‌ ముందర వివరణ
ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారం నిరోధించే విభాగంలో మేనేజర్‌గా(ప్రొడక్ట్‌ ఇంజినీర్‌)గా గతంలో పని చేసిన ఫ్రాన్సెస్‌ హౌగెన్‌.. సంచలన ఆరోపణలతో తెర ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  ఇన్‌స్టాగ్రామ్‌ టీనేజీ అమ్మాయిలపై ఎలాంటి చెడు పరిణామాలు చూపిస్తుందో  సవివరింగా వివరిస్తూ..  ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ ‘ప్రొటెక్టింగ్‌ కిడ్స్‌ ఆన్‌లైన్’ పేరుతో సమగ్ర నివేదికను రూపొందించారు. అది ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితం అయ్యింది కూడా. ఆ తర్వాత ఓ టీవీ ఛానెల్‌ ద్వారా కెమెరా ముందుకు వచ్చిన ఫ్రాన్సెస్‌..  మంగళవారం తాను రూపొందించిన నివేదికను సెనెట్‌ సభ్యులకు సైతం అంచారు. 



‘‘ఫేస్‌బుక్‌ పిల్లలకు హాని చేస్తోందని, లాభం కోసమే ప్రయత్నాలు చేస్తోందని నియంత్రించాల్సిన అవసరం ఉంద’ని ఆమె చాలా బలంగా ఆరోపిస్తోంది.  తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఫేస్‌బుక్‌ ప్రయత్నిస్తోందంటూ సెనెటర్ల ముందు ఆమె వివరణ కూడా ఇచ్చారు. ఇక ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు సమాచారం, సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న వైనంతో పాటు  పొరపాటు సరిదిద్దుకోకుండా మరిన్ని తప్పులు చేస్తోందని, అందుకే కంపెనీ నుంచి బయటకు వచ్చినట్టు వెల్లడించారు. ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ ఆరోపణలతో ఫేస్‌బుక్‌ వివాదం కొత్త మలుపు తీసుకుంది.ఇందులో వివరాలు కనుక పక్కా ఆధారాలతో రుజువైతే ఫేస్‌బుక్‌ చిక్కులు ఎదుర్కొనడం ఖాయం. 

కొసమెరుపు: భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి ఆరు నుంచి ఏడు గంటలపాటు ఫేస్‌బుక్‌ అండ్‌ కో సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. పైకి ఇది టెక్నికల్‌ ప్రాబ్లం అని చర్చ జరుగుతున్నప్పటికీ.. కొందరు మేధావులు మాత్రం ఫ్రాన్సెస్‌ హౌగెన్‌ ఆరోపణలు వెలుగులోకి వచ్చాకే ఇది జరగడంతో ఫేస్‌బుక్‌ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా కోట్ల మంది యూజర్ల డాటా అమ్ముకుందనే ఆరోపణల్ని ఫేస్‌బుక్‌పై గుప్పిస్తున్నారు.
 

చదవండి: ఆరు గంటల్లో.. ఫేస్‌బుక్‌లో ఇది జరిగింది

Advertisement
Advertisement