● మంత్రి ఆర్కే రోజా ధ్వజం
తిరుమల: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175 కి 175 సీట్లు పక్కాగా గెలుస్తుందని మంత్రి ఆర్కే రోజు ధీమా వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ తాను నగరి నియోజకవర్గంలో రోజూ గడపగడపకు వెళుతూ పల్లెనిద్ర చేస్తున్నానని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో ముందుంటున్నానన్నారు. అందుబాటులో ఉన్నాం కాబట్టే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రినయ్యానని చెప్పారు. నగరిలో రోజాకు సీటు లేకుంటే రాధాకృష్ణ నిల్చుంటాడా.. రామోజీరావు నిల్చుంటాడా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడడానికే భయపడుతున్నారన్నారు. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. తాను జగన్ అన్నకు తోడుగా ఉంటానని రోజా స్పష్టం చేశారు. తనకు ఎమ్మెల్యే సీటు లేదనే ప్రచారం కేవలం శునకానందమేనని అన్నారు. పచ్చ మీడియా దిగజారుడు వార్తలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి 100 శాతం పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు.