వెదురుకుప్పం: పేదవాడి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలన్నా.. పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య అందాలన్నా మళ్లీ జగనన్నే రావాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఆదివారం మండలంలోని పచ్చికాపల్లం, కొమరగుంట పంచాయతీల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గడిచిన 58 నెలల కాలంలో గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ, వెల్నెస్ సెంటర్ల నిర్మాణాలతో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రధానంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున సిమెంటు, తారురోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లో 50 పడకల ఆస్పత్రులు మంజూరు చేయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో వెదురుకుప్పం మండలంలోని పచ్చికాపల్లంలో డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి పేదవానికీ ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. అందరూ జగనన్న అందించిన సంక్షేమ పాలనను గుర్తు చేసుకుని మళ్లీ అందరి తలరాతలు బాగు పడాలంటే జగనన్నను సీఎం చేసుకోవాలని అభ్యర్థించారు.