నాన్నా.. ఉరేసుకుని చనిపోతున్నా..  | Sakshi
Sakshi News home page

నాన్నా.. ఉరేసుకుని చనిపోతున్నా.. 

Published Thu, Jan 25 2024 4:39 AM

AR constable committed suicide due to family quarrel - Sakshi

పెన్‌పహాడ్‌: ‘నాన్నా.. బాధలు భరించలేకపోతున్నా.. అందుకే ఉరేసుకుని చనిపోతున్నా’అని తండ్రికి ఫోన్‌లో చెప్పి ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. పెన్‌పహాడ్‌ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన అర్రూరి జానకిరాములు, జానకమ్మ దంపతుల కుమారుడు సైదులు (41) 2009లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించాడు.

ఆయనకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన పార్వతితో వివాహం జరిగింది. వీరికి హైదరాబాద్‌లో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్న సాయి భవన్, మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసిన సాయిపూజిత సంతానం. సైదులు ప్రస్తుతం సూర్యాపేటలో ఉద్యోగం చేస్తూ అక్కడే అంజనాపురి కాలనీలో భార్యతో కలసి ఉంటున్నాడు.  

పది రోజుల క్రితం గొడవ 
కొంతకాలంగా సైదులు కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం గొడవ తారస్థాయికి చేరడంతో పార్వతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సైదులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్వగ్రామంలోని పొలంవద్దనుంచి తండ్రికి ఫోన్‌ చేసి ఉరేసుకుని చనిపోతున్నానని చెప్పాడు.

జానకిరాములు ఉదయం గ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని వేలాడుతున్న కుమారుడు కనిపించాడు. సమీపంలోని రైతులు వచ్చి సైదులును కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ వెంకన్నగౌడ్‌ ఇతర పోలీస్‌ సిబ్బంది పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు. 

Advertisement
Advertisement