సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల పేరుతో ఎర వేసి, అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడులు పెట్టించి అందినకాడికి దండుకుంటున్న రెండు ముఠాలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ చెప్పారు. రెండు వేర్వేరు కేసులకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ డి.కవిత శుక్రవారం తెలిపారు. ఏసీపీ ఆర్జీ శివమారుతితో కలిసి బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.
విదేశీ ట్రేడింగ్ పేరుతో వృద్ధుడిని...
నగరానికి చెందిన ఓ వృద్ధుడు కొన్నేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నారు. అతడికి కొన్నాళ్ల క్రితం టెలిగ్రాం ద్వారా ఇంటర్నేషనల్ కంపెనీలో ట్రేడింగ్ పేరుతో సందేశం వచి్చంది. ఆయన ఆసక్తి చూపడంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన అవతలి వ్యక్తులు సౌత్ ఆఫ్రికాకు చెందిన ఉకుచుమ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ప్రైవేట్ లిమిడెట్ త్వరలో ఆన్లైన్ స్టాక్స్ ప్రారంభిస్తోందని చెప్పారు. అవి ఖరీదు చేయాలంటే ప్రత్యేక డీమ్యాట్ ఖాతా అవసరమని, సైప్రస్కు చెందిన ఎక్స్ప్రోమార్కెట్స్ అనే సెక్యూరిటీస్ సంస్థలో తెరవాలని సూచించారు. నగరవాసి అలానే చేసిన తర్వాత అమెరికా డాలర్ల రూపంలో పలు దఫాలు ట్రేడింగ్ చేయించారు.
ఎప్పటికప్పుడు ఆయనకు లాభాలు వస్తున్నట్లు చూపించి వెబ్సైట్ డ్యాష్బోర్డ్లో అవి కనిపించేలా చేశారు. ఇలా 250 డాలర్లతో ప్రారంభించి 80,300 డాలర్ల (రూ.66.56 లక్షలు) వరకు పెట్టుబడి పెట్టించారు. ఈ మొత్తాన్ని బాధితుడు ఇండియన్ కరెన్సీ రూపంలో వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. నగదు తీసుకోవాలని భావించగా... డీమ్యాట్ ఖాతాలో నెగిటివ్ బ్యాలెన్స్ ఉందంటూ మరికొంత పెట్టుబడి పెట్టమన్నారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.నగేష్ దర్యాప్తు చేశారు. ఈ నేరాలు చేయడానికి అవసరమైన బ్యాంకు ఖాతాలను గుజరాత్కు చెందిన అరి్వంద్ కుమార్, ఘన్శ్యామ్సింగ్ సమకూర్చినట్లు గుర్తించారు. వీరిని అరెస్టు చేసి విచారించిన నేపథ్యంలో వీరి బ్యాంకు ఖాతాల ఆధారంగా మరో రూ.4 కోట్ల స్కామ్ జరిగినట్లు, వీటిపై రాష్ట్రంలో రెండుతో సహా దేశ వ్యాప్తంగా ఐదు కేసులు నమోదైనట్లు తేల్చారు. ఆయా ఖాతాల్లో ఉన్న రూ.66 లక్షలు, హైదరాబాద్ వాసికి చెందిన రూ.35 లక్షలను సైబరాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు.
రూ.500 ఇచ్చి రూ.2.38 లక్షలు స్వాహా...
నగరానికి చెందిన సంస్థలో ప్రాజెక్టు మేనేజర్గా పని చేస్తున్న యువకుడు మంచి ఉద్యోగం కోసం ప్రయతి్నస్తున్నాడు. అతడికి టెలిగ్రాం యాప్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్రకటన వచ్చింది. ఈయన స్పందించడంతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫ్లైట్ టికెట్ బుకింగ్ టాస్్కలు చేయాలని చెప్పారు. ఇతడితో తమ యాప్లో వర్చువల్ ఖాతా ఓపెన్ చేయించి, తొలుత ఒక టికెట్ బుక్ చేయించారు. దీనికి సంబంధించి రూ.500 బోనస్ ఇచ్చారు. ఆపై ఇన్వెస్టిమెంట్స్ పేరు చెప్పి రూ.2.38 లక్షలు పెట్టుబడి పెట్టించి వర్చువల్ ఖాతా డ్యాష్బోర్డులో లాభాలు చూపారు. ఈయన డబ్బు తీసుకోవాలని భావిస్తే నెగిటివ్ బ్యాలెన్స్ కథ మొదలెట్టారు.
దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎస్.నగేష్ నేతృత్వంలోని బృందం బోగస్ కంపెనీల పేర్లతో కరెంట్ బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన ముంబై వాసి మహ్మద్ షోయబ్ బబ్లూ ఖాన్ను పట్టుకుంది. ఇతడి నుంచి రూ.5 లక్షలు రికవరీ చేసి విచారించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్కు చెందిన అబ్దుల్లా ఫారూఖ్ సూత్రధారిగా తేలడంతో అతడిని అరెస్టు చేసింది. వీరు ఈ బ్యాంకు ఖాతాల ఆధారంగా దేశ వ్యాప్తంగా 42 నేరాలు చేసి రూ.4.5 కోట్లు కాజేసినట్లు తేలింది. వీటిలో ఆరు కేసులు రాష్ట్రానికి సంబంధించినవే. హైదరాబాద్ నుంచి రూ.1.2 కోట్లు, సైబరాబాద్ నుంచి రూ.10 లక్షలు, రాచకొండ నుంచి రూ.65 లక్షలు వీళ్లు కాజేశారు. ఈ నిందితుల నుంచి పలు బ్యాంకు పాస్బుక్స్, డెబిడ్/క్రెడిట్ కార్డులు సిమ్ కార్డులు తదితరాలు స్వా«దీనం చేసుకున్నారు.