HYD: డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులు.. 9 బ్లడ్‌ బ్యాంకులకు నోటీసులు | Sakshi
Sakshi News home page

HYD: డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడులు.. 9 బ్లడ్‌ బ్యాంకులకు నోటీసులు

Published Thu, Feb 22 2024 4:20 PM

Drug Control Bureau Searches Blood Banks In Hyderabad - Sakshi

సాక్షి, హై దరాబాద్‌: నగరంలోని పలు బ్లడ్‌ బ్యాంకుల్లో డ్రగ్‌ కంట్రోల్‌ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 9 బ్లడ్‌  బ్యాంకులకు  నోటీసులు జారీ చేసింది. ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మా నిల్వ, రక్త సేకరణ పరీక్షల్లో లోపాలున్నట్లు గుర్తించింది. మలక్‌పేట,  చైతన్యపురి, లక్డీకపూల్‌, హిమయాత్‌ నగర్‌,సికింద్రాబాద్‌, కోఠి,  మెహదీపట్నం, బాలానగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లోని బ్లడ్‌ బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహించారు.

కాగా, సాధారణ తనిఖీల్లో భాగంగా డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు ఫిబ్రవరి 2న మూసాపేటలోని హీమో సరీ్వసెస్‌ లాబోరేటరీలో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సామర్థ్యానికి మించి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు ఆర్‌ రాఘవేంద్రనాయక్‌ అక్రమంగా ప్లాస్మాను నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శ్రీకర, న్యూలైఫ్‌ బ్లడ్‌ బ్యాంకుల నుంచి హోల్‌ బ్లడ్‌ను సేకరించి, ప్లాస్మాను వేరు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు.

ఈ అక్రమాల్లో భాగస్వామిగా ఉన్న మియాపూర్‌లోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకు సహా, దారుషిఫాలోని న్యూలైఫ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంకు కూడా ఉంది. ఈ రెండు బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రస్తుతం గ్రేటర్‌లో ఐపీఎం సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల బర్త్‌డేల పేరుతో ఇంజినీరింగ్‌ కాలేజీలు, కార్పొరేట్‌ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తుంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్‌ చేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగుల కు అందజేయాల్సి ఉంది. కానీ నగరంలోని పలు బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం రక్తాన్ని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్‌ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా అందజేయాలనే నిబంధన ఉంది. దీనిని నగరంలోని పలు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. 
     

 
Advertisement
 
Advertisement