పదేళ్లుగా 50 మంది బాలికలపై అత్యాచారం.. | Sakshi
Sakshi News home page

పదేళ్లుగా లైంగిక దారుణాలు.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్‌

Published Tue, Nov 17 2020 8:22 PM

UP engineer Molested 50 minors over 10 years CBI Arrest - Sakshi

లక్నో : అభంశుభం తెలియని చిన్నారులపై ఓ ప్రభుత్వ ఉద్యోగి పదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. పదేళ్లుగా 50  మంది చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ జూనియర్‌ ఇంజనీర్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. మంగళవారం అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచిన అనంతరం సీబీఐ అధికారులు వివరాలను వెల్లడించారు. వారి చెప్పిన విషయాల ప్రకారం.. రామ్‌భవన్‌ అనే వ్యక్తి జూనియర్‌ ఇంజనీర్‌గా ఇరిగేషన్‌ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. పైకి బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తూ కన్నుపడిన బాలికపై కామవాంఛను తీర్చుకునేవాడు. పదేళ్లుగా దాదాపు 50 మందికి పైగా బాలికలపై అత్యాచారం చేశాడు. వీరిలో చాలామంది మైనర్‌ బాలికలే కావడం గమనార్హం. చిత్రకూట్‌, హామీర్పూర్‌, బండా ప్రాంతాల్లోని పేద మైనర్‌ బాలికలను టార్గెట్‌గా చేసుకుని లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అంతేకాకుండా ఈ ఘనకార్యానంతా ఫోటోలు, వీడియోల్లో బంధించేవాడు. ఆయా వీడియోలను ఇతరులకు సైతం పంపిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా బాధిత బాలికలకు విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులు సైతం ఇచ్చి లోబర్చుకునేవాడని పోలీసుల ద్వారా తెలిసింది. అయితే గతంలోనే ఇతనిపై పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు వచ్చినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడం యూపీ పోలీసు శాఖ ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం అతని నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు పెద్ద ఎత్తున సాక్ష్యాలను సేకరించి అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి పెద్ద ఎత్తున సీడీలు, వీడియోలు, మొబైల్‌ ఫోన్స్‌తో పాటు కొంతమంది బాలికల ఫోటోలను సైతం స్వాధీనం చేసుకున్నారు. మైనర్‌ బాలికలపై ఆకృత్యానికి పాల్పడిన రామ్‌ భవన్‌కు కఠిన శిక్ష పడేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ ఘటన యూపీ వ్యాప్తంగానే కాకుండా దేశంలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. 

Advertisement
Advertisement