తిరుమల: ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్నంటూ, గతకొంత కాలంగా తిరుమలలో అక్రమాలకు పాల్పడుతున్న వెంకటరమణరావు అనే వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతను నకిలీ గుర్తింపు కార్డుతో శ్రీవారి వీవీఐపీ దర్శన టోకన్లను సంపాదించి వ్యాపారవనరుగా మార్చుకున్నాడు. గత నెల తనే స్వయంగా వీవీఐపీ టోకన్లతో శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఆలయ అధికారులకు అనమానం రావటంతో, సదరు వ్యక్తిపై ఆరా తీయగా మొత్తం బండారం బయట పడింది.
ఈ విషయంపై టీవీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. తమ ఛానల్కు ఆ వ్యక్తితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కాగా, ఈ వ్యక్తి గతంలో కూడా నకిలీ గుర్తింపు కార్డు చూపించి అనేక అక్రమాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.