Three of a Family Killed in House Collapse in Suryapet - Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో విషాదం.. గోడకూలి మట్టిపెళ్లల కింద నలిగిన కుటుంబం

Published Thu, Aug 3 2023 8:11 PM

Family Killed In Suryapet wall collapse - Sakshi

సాక్షి, సూర్యాపేట: తల్లిదండ్రులను చూసేందుకు ఇంటికి వచ్చిన కొడుకు.. ఆ తల్లిదండ్రులతో కలిసి కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ ఇంటి గోడ కూలి మట్టిపెళ్లల కింద నలిగి ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. సూర్యపేట జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 

నాగారం మండల కేంద్రంలో శీలం రాములు తన భార్య రాములమ్మ, కొడుకు శ్రీనివాస్‌(35)తో ఉంటున్నాడు. అయితే కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు శ్రీను హైదరాబాద్‌కు వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల్ని చూసేందుకు ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి భారీగా గాలి దుమారం వీచింది.  అప్పటికే ఆ ఇంటి మట్టి గోడలు వర్షాలకు నానిపోయి ఉండడంతో.. అవి కుప్పకూలి ఆ ముగ్గురి మీద పడినట్లున్నాయి.

గురువారం ఉదయం విద్యుత్ శాఖ ఉద్యోగి కరెంట్ బిల్లు ఇచ్చేందుకు వెళ్లే వరకు ఆ ఇల్లు కూలిన విషయాన్ని ఎవరూ గమనించకపోవడం గమనార్హం. దీంతో.. ఆ ఉద్యోగి స్థానికులను అప్రమత్తం చేశాడు. అయితే అప్పటికే మట్టిపెళ్లల కింద చిక్కుకుని రాములు, రాములమ్మ, శ్రీను ప్రాణం విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను ట్రాక్టర్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిద్రలోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement