అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం | Sakshi
Sakshi News home page

అక్కను వేధించవద్దన్నందుకు అమానుషం

Published Sat, Jun 17 2023 4:48 AM

Four people poured petrol on 10th student and set him on fire - Sakshi

చెరుకుపల్లి: తన అక్కను వేధించవద్దని చెప్పిన పదో తర­గతి విద్యార్థిపై ఓ యువకుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందా­డు. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలవారిపాలెంలో శుక్రవారం జరిగింది.

బాపట్ల డీఎస్పీ మురళీకృష్ణ కథనం ప్రకారం... రాజవోలు గ్రామ పరిధిలోని ఉప్పాలపాలేనికి చెందిన ఉప్పాల మాధవి కుమారుడు ఉప్పాల అమర్‌నా«­థ్‌ (15) ఉదయం ఐదు గంటల సమయంలో రాజవోలు­కు సైకిల్‌పై ట్యూషన్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో రాజవోలు గ్రామానికి చెందిన పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ), అతని స్నేహితులు మరో ముగ్గురు కలిసి అమర్‌నాథ్‌ను అడ్డగించి సైకిల్‌ లాక్కుని రోడ్డు పక్కన మొక్కజొన్న బ­స్తాలు వేసిన చోటుకు తీసుకువెళ్లి దాడి చేశారు.

అనంత­రం ముందుగానే తెచ్చుకున్న పెట్రోల్‌ను అమర్‌నాథ్‌పై పోసి నిప్పు అంటించి అక్కడ నుంచి పారిపోయారు. మం­టలు రావటంతో సమీపంలోని గ్రామస్తులు గమనించి ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పి అమర్‌నాథ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన అతడిని గుంటూరు ప్రభుత్వ ఆస్ప­త్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.  

గతంలోనూ దాడి..  
పదో తరగతి ఫెయిల్‌ అయి ఖాళీగా తిరుగుతున్న పాము వెంకటేశ్వరరెడ్డి (వెంకీ) కొంతకాలంగా అమర్‌నా«థ్‌ అక్కను టీజ్‌ చేస్తున్నాడు. దీంతో వెంకీ, అమర్‌నాథ్‌ మధ్య గొడవ జరిగింది. అమర్‌నా«థ్‌పై వెంకీ దాడి చేశాడు. ఈ విషయం వెంకీ కుటుంబ సభ్యుల దృష్టికి కూడా అమర్‌నాథ్‌ తరఫు పెద్దలు తీసుకెళ్లారు. పాఠశాలలకు సెలవులు రావడంతో వీరు కలవలేదు.

తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో అమర్‌నా«థ్, ట్యూషన్, స్కూలుకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మార్గంమధ్యలో అమర్‌నాథ్‌ను వెంకీ అడ్డగించి బెదిరించటం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వెంకీ తన స్నేహితులతో కలిసి శుక్రవారం అమర్‌నాథ్‌పై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. అమర్‌నాథ్‌ తండ్రి  నాంచారయ్య గతంలోనే మరణించారు. అమర్‌నాథ్‌ తల్లి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని  విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.

Advertisement
Advertisement