రుణం ఇప్పిస్తామని రూ.8కోట్లకు టోకరా  | Sakshi
Sakshi News home page

రుణం ఇప్పిస్తామని రూ.8కోట్లకు టోకరా 

Published Sat, Jun 11 2022 1:30 AM

Ghatkesar Police Arrested Three People Over Loan Fraud Case - Sakshi

ఘట్‌కేసర్‌: గొర్రెల పంపిణీ సబ్సిడీ రుణం ఇప్పిస్తామని చెప్పి అమా యకుల దగ్గర్నుంచి రూ.8 కోట్లు వసూలు చేసిన ముగ్గురిని ఘట్‌కేసర్‌ పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వారికి ప్రభుత్వమిచ్చే సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొర్రెముల్‌ సహాయ పశువైద్యాధికారి సజ్జ శ్రీనివాస్‌రావు, సజ్జ లక్ష్మి, కొల్లి అరవింద్‌కుమార్‌ గొల్ల, కురుమల దగ్గర రూ.8 కోట్లు వసూలు చేశారు.

ఎంతకూవీరు రుణాల ఊసెత్తకపోవడంతో డబ్బులిచ్చిన వారు గట్టిగా నిలదీశారు. దీంతో అప్పట్నుంచి ఈ ముగ్గురూ ఎవరికీ కన్పించకుండా ముఖం చాటేశారు. ఎనిమిది నెలల క్రితం కూకట్‌ పల్లికి చెందిన బాధితులు ప్రమీలా, జ్యోతి తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించి వీరిపై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. శ్రీనివాస్, లక్ష్మి దంపతులు మేడ్చల్‌లో, అరవింద్‌ కుమార్‌ రామాంతపూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు వల పన్ని శుక్రవారం అరెస్టు చేశారు.

వీరిని ఎల్బీనగర్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో హాజరు పరచగా కోర్టు వీరికి రిమాండ్‌ విధించింది. కాగా, ఈ కేసులో మరో నిందితుడు సజ్జ శ్రీనివాస్‌ బావమరిది అనిల్‌ కుమార్‌ పరారీలోనే ఉన్నాడు. వీరందరిపై పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎవరైనా బాధితులుంటే ఫిర్యా దు చేయాలని సూచించారు. కేసును ఛేదించిన ఘట్‌కేçసర్‌ పీఎస్‌ సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ అభినందించారు.

Advertisement
Advertisement