HYD: నాన్న కాదు.. నయ వంచకుడు! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: నాన్న కాదు.. నయ వంచకుడు!

Published Fri, Jan 5 2024 12:08 PM

Girl Molested By Father And Boy In Hyderabad  - Sakshi

మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వావి-వరుసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసి కఠిన శిక్షలు విధించినా కీచకుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఇలాంటి అమానవీయ ఘటనే వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కసాయిగా మారి కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని చెప్పినా తల్లి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన స్నేహితునికి బాధితురాలు దగ్గరైంది.  ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లిన ఓ యువకుడు కూడా బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. 

బీహర్‌కు చెందిన ఓ కుటుంబం కుత్బుల్లాపూర్‌ లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కుమార్తె(18) తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. కుటుంబీకులు కరోనా కారణంగా చదువు మాన్పించడంతో ఇంటి వద్దే ఉంటోంది. కొంతకాలంగా తండ్రి లైంగికంగా వేధించసాగాడు. పలుమార్లు అత్యాచారం చేసి.. ఎవరికీ చెప్పొద్దంటూ భయపెట్టాడు. ఈ విషయం తల్లికి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. గతేడాది దీపావళికి బిహార్‌కు వెళ్లివస్తుండగా.. రైలులో అదే రాష్ట్రానికి చెందిన యువకుడు సంతోష్‌ పరిచయమయ్యాడు. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్‌ చేసుకున్నారు. అతడు బడంగ్‌పేట గాంధీనగర్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. 

ఈ క్రమంలో గత నెల 26న సంతోష్‌ కలవాలని కోరడంతో యువతి సికింద్రాబాద్‌ వెళ్లింది. ఇద్దరు కలిసి ఎన్టీఆర్‌ గార్డెన్‌, ట్యాంక్‌బండ్‌ ప్రాంతాల్లో తిరిగారు. అనంతరం అతడు కుత్బుల్లాపూర్‌లో ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. చెప్పకుండా బయటకు వెళ్లినందుకు కొడతారనే భయంతో ఆమె తిరిగి సికింద్రాబాద్‌ స్టేషన్‌కి పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్‌ తీసుకొని సంతోష్‌కు ఫోన్‌చేసింది. రవి సాయంతో సంతోష్‌ వద్దకు వెళ్లింది. మరుసటిరోజు ఇంటికి వెళ్లాలని ఆమెకు ప్రేమికుడు చెప్పాడు. తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్లకుండా తనకు ఉద్యోగం ఇప్పించాలని  వెంట వచ్చిన రవిని కోరడంతో.. అతడు అమీన్‌పూర్‌లో తన గదికి తీసుకెళ్లాడు. ఈ నెల 29న మద్యం మత్తులో రవి ఆమెపై లైంగిక దాడి చేశాడు.

రవి చిత్రహింసలు భరించలేక ఆమె సికింద్రాబాద్‌కు పారిపోయింది. కుటుంబీకులకు ఫోన్‌చేసి సికింద్రాబాద్‌ స్టేషన్‌ రావాలని చెప్పింది. వారు రావడంతో జరిగిన విషయం వివరించింది. తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దర్యాప్తులో పోలీసులకు తన తండ్రి చేసిన అఘాయిత్యాన్ని కూడా ఆ బాలిక వివరించింది. దీంతో బాలిక తండ్రితో పాటు ఆ యువకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: నాన్నా.. నేనేం పాపం చేశాను!

Advertisement
Advertisement