విద్యార్థిని అనుమానాస్పద మృతి  | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అనుమానాస్పద మృతి 

Published Sat, Jan 13 2024 3:14 AM

Hanamkonda: BSc student dies by suicide in hostel room - Sakshi

హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి శివారులోని ఓ విద్యాసంస్థలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్న విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాథోడ్‌ మోహన్‌సింగ్‌ ఆరోపించారు. ఈ మేరకు హసన్‌పర్తి ఠాణాలో ఫిర్యాదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ మండలం కండెపల్లికి చెందిన రాథోడ్‌ మోహన్‌సింగ్‌ (డిప్యూటీ కలెక్టర్, మైనారిటీ కార్పొరేషన్‌ అ«ధికారి, నిర్మల్‌) కూతురు రాథోడ్‌ దీప్తి(19) కళాశాల హాస్టల్‌లోనే ఉంటూ అగ్రికల్చర్‌ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం దీప్తి కళాశాల హాస్టల్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. 

ఉరి వేసుకున్నట్టు సమాచారం ఇవ్వలేదు 
దీప్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, గురువారం సాయంత్రం తాను ఫోన్‌లో మాట్లాడినట్టు తండ్రి మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. ఉదయం తన భార్య ఫోన్‌ చేస్తే త్వరగా ఎంజీఎంకు రమ్మన్నారే తప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పలేదన్నారు. మృతదేహాన్ని కిందకు దింపిన సమయంలో సెక్యూరిటీ సిబ్బందితోపాటు మరికొంతమంది మగవారు ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. కిందకు దింపినప్పుడు తహసీల్దార్, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.

దీప్తిపై అత్యాచారం, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి మోహన్‌సింగ్‌ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. 11,12 తేదీల్లో సీసీ ఫుటేజీ సేకరించాలని పోలీసులను కోరారు. దీప్తి మృతిపై సమగ్ర విచారణకు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. టీజీవీపీ, టీఎస్‌ఎఫ్, గిరిజన శక్తి మోర్చ సంఘాలు ఆ విద్యాసంస్థ ఎదుట ఆందోళన నిర్వహించాయి. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. దీప్తి మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్‌ గోపి తెలిపారు. కాజీపేట ఏసీపీ డేవిడ్‌ రాజు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్‌ చేసినట్టు తెలిపారు.

Advertisement
Advertisement