ఆ దుర్మార్గులు ఎంత పని చేశారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మందిని.. | Sakshi
Sakshi News home page

ఆ దుర్మార్గులు ఎంత పని చేశారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మందిని..

Published Tue, Jun 28 2022 10:06 PM

Maharashtra: 2 Arrested For Allegedly Poisoning Of 9 Family Members Death Sangli - Sakshi

ముంబై: మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసుకి సంబంధించిన దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్యగా గుర్తించారు.

వారిది ఆత్మహత్య కాదు హత్య.. 
సాంగ్లీ జిల్లాలోని మైసల్​ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిది మంది ఉండేవారు. ఈ నెల 20న కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మొదటగా.. అన్నదమ్ములకు అప్పులు ఎక్కువ ఉండడంతో, వాటిని తీర్చడం కష్టంగా భావించి వేరే దారి లేక కుటుంబంతో సహా వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని తేలింది.

కానీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఎక్కడో అనుమానం రావడంతో ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్​ విషయాలు వెలువడ్డాయి! ​ఆ కుటుంబ సభ్యులకు ఆత్మహత్య కాదని, విషం ఇచ్చి వారిని చంపేశారని గుర్తించారు. గుప్త నిధుల కోసం ధీరజ్‌ చంద్రకాంత్‌, అబ్బాస్‌ మహ్మద్‌ అలీ అనే ఇద్దరు మాంత్రికులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు దర్తాప్తులో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరేదైన కోణం కూడా దాగుందా అని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement