10 Killed And 8 Injured In Odisha Bus Accident In Ganjam District, Details Inside - Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి..

Published Mon, Jun 26 2023 9:00 AM

Many People Died In Odisha Bus Accident In Ganjam District - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సును పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో ఎనిమి​ది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

వివరాల ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున దిగపహండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 10 మంది మృతిచెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు, సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో గాయపడిని వారిని బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించి వైద్యసాయం అందిస్తున్నారు. 

అయితే, ఓ పెళ్లికి హాజరయ్యేందుకు పెళ్లి బృందం ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు రాయ్‌గఢ్‌ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తోంది. కాగా, మృతుల్లో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. 

ఇక, ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థికసాయం చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 

ఇది కూడా చదవండి: టిక్కెట్‌ లేకుండా ‘వందేభారత్‌’ ఎక్కి.. భయంతో వాష్‌రూమ్‌లో నక్కి..

Advertisement
Advertisement