Hyderabad: భర్తను ఫంక్షన్‌ను పంపి భార్య అదృశ్యం.. స్నేహితుడిపై అనుమానం | Married Woman Goes Missing In Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad: భర్తను ఫంక్షన్‌ను పంపి భార్య అదృశ్యం..

Published Wed, Aug 23 2023 8:18 AM

married woman missing in hyderabad - Sakshi

హైదరాబాద్: భర్తను ఫంక్షన్‌ను పంపిన భార్య అతను తిరిగి వచ్చేలోపు ఇంటి నుంచి అదృశ్యమైన సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. ఎస్‌ఐ ఉదయ్‌ సమాచారం మేరకు... జి.ప్రశాంత్, తేజస్వినీలకు 2020 నవంబర్‌లో వివాహం అయింది. వారు రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్‌ కొరియర్‌ బాయ్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కిరణ్‌ తదితర యువకులు పరిచయం అయ్యారు. తరచూ ఆ యువకులు ప్రశాంత్‌ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉండేవారు.

కిరణ్‌ కూడా తేజస్వినీని అమ్మా అని, అక్కా అని వివిధ రకాలుగా సంబోధిస్తూ తనవారుగానే ఇతరులకు పరిచయం చేసుకున్నాడు. కాగా ఈ నెల 20వ తేదీ ప్రశాంత్‌ తమకు తెలిసిన వారి ఫంక్షన్‌కు వెళదామని భార్యను అడగ్గా నీవు ఒక్కడివే వెళ్లు నేను రానని చెప్పింది. అంతేగాకుండా భర్తను అందంగా ముస్తాబు చేసి, త్వరగా ఇంటికి రమ్మని చెప్పి ఫంక్షన్‌కు పంపింది. అతను ఫంక్షన్‌కు వెళ్ల తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కనిపించలేదు.

అంతేగాకుండా ఆమెకు సంబంధించిన దుస్తులు, నగదు, ఇతర వస్తువులు కనబడలేదు. చుట్టుపక్కల విచారించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కిరణ్‌ అనే వ్యక్తి మినహా అందరూ వచ్చి ఆమె కోసం గాలించారు. అయినా కనిపించకపోవతంతో ప్రశాంత్‌ మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు పిల్లలు లేరని, కిరణ్‌ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉండవచ్చని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
Advertisement