ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ  | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పెదకాకాని ఏఈ 

Published Sat, Mar 2 2024 2:59 AM

Pedakakanani AE caught by ACB - Sakshi

మంజూరైన బిల్లుల ప్రాసెస్‌కు రూ.1.68 లక్షలు డిమాండ్‌ 

పీఆర్‌ డివిజన్‌ కార్యాలయం వద్ద పట్టుకున్న అధికారులు 

నగరంపాలెం: మంజూరైన బిల్లులను ప్రాసెస్‌ చేసేందుకు లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధి­కా­రులకు చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయతీ పరిధిలో సమ్మర్‌ స్టోరేజీ (ఎస్‌ఎస్‌) ట్యాంకర్‌కు సంబంధించి మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్, ఫెన్సింగ్‌ పనులను గుంటూరు రూరల్‌ మండల పరిధిలోని నల్లపాడు గ్రామానికి చెందిన శ్యామల రవికిషోర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ పూర్తి చేశారు. అందుకుగాను మూడు బిల్లుల్లోనూ దాదాపు రూ.42 లక్షలు మంజూరయ్యాయి.

అయితే మంజూరైన బిల్లులను ప్రాసెస్‌ చేసేందుకు రూరల్‌ వాటర్‌ సప్లయి/శానిటేషన్‌ గుంటూరు డివిజన్‌ పరిధిలోని పెదకాకాని ఏఈ పి.శివరామకృష్ణ కాంట్రాక్టర్‌ రవికిషోర్‌రెడ్డిని లంచం డిమాండ్‌ చేశారు. రూ.42 లక్షల బిల్లులకు నాలుగు శాతం చొప్పున రూ.1.68 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ రవికిషోర్‌రెడ్డి టోల్‌ఫ్రీ నంబర్‌ 14400ను సంప్రదించారు. ఏసీబీ వారి సూచనల మేరకు నగదు ఇవ్వడానికి రవికిషోర్‌రెడ్డి ఒప్పకున్నాడు. దీంతో శుక్రవారం సాయంత్రం జెడ్పీ ప్రాంగణంలో ఉన్న పీఆర్‌ (ఆర్‌డబ్ల్యూఎస్‌) డివిజన్‌ కార్యాలయం వద్దకు రావాలని కాంట్రాక్టర్‌కు ఏఈ శివరామకృష్ణ సూచించారు.

దీంతో అక్కడకు వెళ్లిన కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.68 లక్షల లంచం తీసుకుంటున్న శివరామకృష్ణను గుంటూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలకలూర్‌రోడ్‌­లో­ని ఏఈ నివాసంలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ దాడిలో డీఎస్పీ­లు టీవీవీ ప్రతాప్‌ కుమార్, ఎన్‌.సత్యానందం, సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, సురేష్ బాబు, నరసింహా రెడ్డి, ఎస్‌ఐ మూర్తి పాల్గొన్నారు.

Advertisement
Advertisement