భీమిలి హయగ్రీవ రిసార్ట్స్‌లో పేకాట | Sakshi
Sakshi News home page

భీమిలి హయగ్రీవ రిసార్ట్స్‌లో పేకాట

Published Mon, Jan 31 2022 4:32 AM

Poker game played at Bheemili Hayagriva Resorts - Sakshi

తగరపువలస (విశాఖ):  విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీలోని హయగ్రీవ రిసార్ట్స్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శనివారం అర్ధరాత్రి తర్వాత స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు దాడిచేసి 22 మందిని అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వీరి నుంచి రూ.5,70,270 నగదు, ఎనిమిది కార్లు, 23 సెల్‌ఫోన్లు, నగదుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న రూ.21.53 లక్షల విలువైన 323 ప్లాస్టిక్‌ కాయిన్లు స్వాధీనం చేసుకున్నారు. మధురవాడ జోన్‌ ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు, సీఐ జి.వి.రమణ ఆదివారం భీమిలి పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు.

ఎస్‌ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్లు పి.అప్పలరాజు, నమ్మి గణేష్, జగదీష్, ఎస్‌ఐలు సంతోష్, ఖగేష్, అమాన్‌రావు, జ్ఞానేశ్వరి, పద్మావతి దాడులు జరిపారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు చెందిన 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ బడేటి రాధాకృష్ణయ్య కూడా ఉండడం గమనార్హం.  
స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ప్లేయింగ్‌ కార్డులు, నగదు, ప్లాస్టిక్‌ కాయిన్లు 

వీరే సూత్రధారులు  
విశాఖ నగరానికి చెందిన దాట్ల కృష్ణంరాజు, చేబోలు శ్రీనివాస్‌పై పేకాట నిర్వహణ, క్రికెట్‌ బుకీలుగా నగరంలోని పోలీస్‌ స్టేషన్లలో కేసులున్నాయి. వీరే బెంగళూరు తదితరచోట్ల ఉన్న పరిచయాలతో వివిధ జిల్లాలకు చెందిన వారితో వీకెండ్‌లలో పేకాట డెన్‌లు నిర్వహిస్తున్నారు. 

అరెస్టు అయింది వీరే.. 
అరెస్టైన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాగిరాజు శ్రీనివాసరాజు(జక్కవరం, కాళ్ల మండలం), కుంచంపూడి రామకృష్ణంరాజు(గణపవరం మండలం), గాదిరాజు శరత్‌ (భీమవరం), సాగిరాజు హరివర్మ(జువ్వలపాలెం, కాళ్ల మండలం), వేగేశ్న ఆదిత్య (భీమవరం), మంతెన నాగరాజు (మలవని దిబ్బ, కాళ్ల మండలం), నరహరిశెట్టి రాధాకృష్ణ  (మేడవల్లి, ఏలూరు), అడ్డాడ సోమరాజు (ఏఎస్‌ఆర్‌ నగర్, భీమవరం) ఉన్నారు. విశాఖకు చెందిన వారిలో దాట్ల కృష్ణంరాజు(విశాలాక్షినగర్‌), సప్పా రవి(మాధవధార), కంతేటి శేషుబాబు(రామ్‌నగర్‌), చేబోలు శ్రీనివాస్‌(విశాలాక్షినగర్‌), కొల్లిమల్ల నాగ అప్పలరాజు (అనకాపల్లి), ఆడారి జగ్గారావు(చింతల అగ్రహారం), ఆడారి వేణుగోపాలకృష్ణ(అక్కయ్యపాలెం) ఉన్నారు.

కృష్ణాజిల్లాకు చెందిన వారిలో చల్లగుల్ల శ్రీకృష్ణ (పెద పాలపర్రు, ముదినేపల్లి మండలం), బలుసు హరికిరణ్‌ (అడ్డాడ, పామర్రు మండలం), పొట్లూరి మురళీధర్‌ (దొండపాడు, గుడివాడ మండలం), కొర్ని నాగరాజు(భూషణగుళ్ల, పెద్దపారుపూడి మండలం), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిలో యడ్ల రాజారమేష్‌(వేమగిరి, కడియం మండలం), కూనదరాజు సత్యనారాయణరాజు(మణికిపురం, రాజోలు మండలం) ఉన్నారు. రిసార్ట్స్‌ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు, మేనేజర్‌ పాతూరి కృష్ణకాంత్‌లను అరెస్ట్‌ చేయాల్సి ఉంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement