వివాహానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి | Sakshi
Sakshi News home page

వివాహానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి

Published Tue, Aug 23 2022 4:20 AM

Road Accident At Eluru Ganapavaram Three Lost Breath - Sakshi

గణపవరం: పంట కాల్వలో కారు బోల్తా కొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు – అర్ధవరం గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగింది. మృతులు భీమవరంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతానికి చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  భీమవరం కొత్త బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న మహబూబ్‌ బాషా బంధువుల వివాహం ఏలూరులో జరిగింది. దీనికి అమర్జహాన్‌ (50), మహ్మద్‌ సంషాద్‌ (55), ఫాతిమా జహర్‌బీ (45), అమర్జహాన్‌ కుమారుడు కమాల్‌ బాషా, ఎండీ రహీమా కారులో బయలుదేరి వెళ్లారు.

ఫంక్షన్‌ పూర్తి అయ్యాక తాడేపల్లిగూడెంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో కారులో భీమవరం బయలుదేరారు. కారు వల్లూరు వద్ద  రోడ్డు పక్కనున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి.. పంట కాల్వలోకి దూసుకుపోయింది. స్థానికులు వెంటనే కారులో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నీటిలో సగం వరకు కారు మునిగిపోవడంతో కారులో ఉన్న అమర్జహాన్, మహ్మద్‌ సంషాద్‌ (55), ఫాతిమా జహర్‌బీ (45) అనే ముగ్గురు మహిళలు ఊపిరాడక కారులోనే ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న అమర్జహాన్‌ కుమారుడు కమాల్‌ బాషా, ఎండీ రహీమాను స్థానికులు రక్షించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement