పాపన్నపేట (మెదక్): రైతు బీమా డబ్బులకు ఆశపడి కన్నతల్లినే చంపాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది. అన్నారం గ్రామానికి చెందిన ధనమ్మోల్ల శంకరమ్మ (57) పేరిట 23 గుంటల భూమి ఉంది. జీవనోపాధి కోసం కొడుకు ప్రసాద్కు ఆటో కొనిచ్చింది. దురలవాట్లకు బానిసైన కొడుకు డబ్బుల కోసం తరచూ తల్లితో గొడవ పడేవాడు.
ఈ క్రమంలో తల్లిని చంపితే రైతు బీమాతో పాటు డ్వాక్రా గ్రూపు బీమా డబ్బు వస్తుందని దురాలోచన చేశాడు. భార్య కవితతో కలిసి ఆగస్టు 29 తెల్లవారుజామున నిద్రలో ఉన్న శంకరమ్మను కండువాతో ఉరివేసి హతమార్చాడు. దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
కానీ శంకరమ్మ మెడపై గాట్లు ఉండటం చూసిన ఆమె కూతుళ్లు మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీ సులు విచారించగా.. శంకరమ్మను తామే హత్య చేసినట్లు కొడుకు, కోడలు అంగీకరించారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసులో కీలక పరిణామం