సాక్షి, మాడుగులపల్లి: చదువుకోవాలని మందలించినందుకు ఓ కుమారుడు కన్నతండ్రినే కత్తెరతో గొంతులో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు.. బంటు ఎల్లయ్య (45)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు నాగేందర్ సూర్యాపేటలోని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ప్రస్తుతం కాలేజీలు మూతబడటంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఎల్లయ్య దంపతులు బుధవారం ఉదయం పొలానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు.
అప్పటికి నాగేందర్ ఖాళీగా ఉండడంతో.. ‘చదువు లేదు.. అటు వ్యవసాయ పనుల్లోనూ సాయం చేయట్లేదు’ అంటూ ఎల్లయ్య కుమారుడిని మందలించాడు. ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన నాగేందర్ తండ్రితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉన్న కత్తెరతో తండ్రి గొంతులో పొడిచి పరారయ్యాడు. బలమైన గాయమై ఎల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భార్య, కుమార్తె కేకలు వేయగా ఇరుగుపొరుగు వచ్చి ఎల్లయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, తండ్రిపై కత్తెరతో దాడిచేసి పరారైన నాగేందర్ను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
చదవండి: ('ప్రాణంగా పెంచుకున్న కోడిని చంపేశారు.. న్యాయం చేయండి సారూ..')