పోలీసులపై టీడీపీ గూండాల దాడి | Sakshi
Sakshi News home page

పోలీసులపై టీడీపీ గూండాల దాడి

Published Wed, Sep 20 2023 2:58 AM

TDP activists attacked the police - Sakshi

నరసరావుపేట టౌన్‌: పోలీసులపై మరోసారి టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరి­గిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయ­పడ్డారు. చంద్ర­బాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో డాక్టర్‌ కడి­యాల వెంకటేశ్వరరావుకు చెందిన వైద్యశాల ప్రాంగణం­లో హోమం చేపట్టారు. ఒక్కసారిగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ అరవిందబాబు, కడియాల వెంకటేశ్వరరావు ఆధ్వ­ర్యంలో కార్యకర్తలు హోమం జరుగుతున్న స్థలం నుంచి మెయిన్‌రోడ్డు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వైపునకు వచ్చేందు­కు ప్రయత్నించారు.

అక్కడ విధుల్లో ఉన్న సీఐ అశోక్‌కుమార్, సిబ్బం­ది అడ్డుకుని అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని కోరారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చి­పోయి పోలీసుల చొక్కా­లు పట్టుకుని నెట్టివేశారు. దీంతో కిందపడిన స్పెష­ల్‌ పార్టీ పోలీస్‌ సిబ్బందితోపాటు వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ మీరావలికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులను నెట్టివేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసుకూంటూ ర్యాలీగా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపైకి చేరారు. అక్కడ నిలువరించేందుకు ప్రయత్నించిన స్పెషల్‌ పార్టీ పోలీసు­ల­పైనా దాడికి పాల్పడ్డారు.

అనుమతి లేకుండా టీడీపీ చేపట్టిన ర్యాలీ కారణంగా  ఆర్టీసీ బస్టాండ్, మల్లమ్మ సెంటర్, ఓవర్‌ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌక­ర్యా­నికి గురయ్యా­రు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దాడికి పాల్పడిన 20 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట వన్‌టౌన్‌ సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement