Buddha Venkanna: TDP Leader Arrested In Vijayawada, Details Inside - Sakshi
Sakshi News home page

టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్

Published Mon, Jan 24 2022 6:24 PM

TDP Leader Buddha Venkanna Arrested In Vijayawada - Sakshi

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వెంకన్న చేసిన వ్యాఖ్యలపై విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు రావటంతో కేసు నమోదు చేశారు. ఏసీపీ కె.హనుమంతరావు ఆధ్వర్యంలో సాయంత్రం వెంకన్న ఇంటికి వెళ్లి విచారణకు రావాలని కోరారు.

వెంకన్న అనుచరులు పోలీసులను లోపలకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో వెంకన్నను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వదిలేశారు. అంతకుముందు వెంకన్న మరో టీడీపీ నేత నాగుల్‌మీరాతో కలిసి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి కొడాలి నాని, డీజీపీపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ‘అరే కొడాలి నానీ.. చంద్రబాబు ఇంటి గేట్‌ ముట్టుకో. నీ శవాన్ని పంపుతా. అరే నానీ కొట్టుకుందాం రా..’ అంటూ వీరంగం వేశారు. ‘అరేయ్‌ కొడాలి నాని నీ భాషేంటి? నీ చరిత్ర ఏంట్రా? గుడివాడలో ఆయిల్‌ దొంగవి. వర్ల రామయ్య నిన్ను లోపలవేసి చితక బాదిన విషయం అందరికీ తెలుసు’ అంటూ రెచ్చిపోయారు. ‘పోలీసుల్లేకుండా విజయవాడలో ప్లేస్, టైమ్‌ ఫిక్స్‌ చెయ్యి. కొట్టుకుందాం రా’ అంటూ సవాళ్లు విసిరారు.

గుడివాడకు వ్యభిచార కంపెనీ తీసుకొచ్చావని, నోటి దూలతో కృష్ణా జిల్లా పరువు తీశావని అన్నారు. నువ్వు తోపు అయితే కెమెరా పట్టుకొని చంద్రబాబు ఇంటికి వెళ్లు చూద్దాం అంటూ సవాల్‌ విసిరారు. చంద్రబాబు గేట్‌ తాకితే నాని శవాన్ని పంపుతానంటూ హెచ్చరించారు. ‘నీ బావ, బావమరిది అనుకున్నవా? మమ్మల్ని వాడు, వీడు అంటున్నావు? డీజీపీ ఎక్కడ ఉన్నా వదిలే ప్రసక్తే లేదు’ అంటూ ఊగిపోయారు. నాని కులాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. ‘చంద్రబాబును నా కొడకా అంటున్నావు నీ బాబు పేరు ఏంట్రా? 2004లో నీకు టిక్కెట్‌ ఇచ్చింది చంద్రబాబు. హరికృష్ణ కాదు. 2024లో ఓడిపోయిన అర గంటలో ప్రజలు నిన్ను చంపుతారు. ఓడిపోగానే దుబాయి పారిపోతావు. డీజీపీ అంటే డైరెక్టర్‌ ఆఫ్‌ జగన్‌ పార్టీగా గౌతమ్‌ సవాంగ్‌ వ్యవహరిస్తున్నారు. గుడివాడ కేసినోలో రూ.250 కోట్లు చేతులు మారాయి. డీజీపీ నీ వాటా ఎంతో చెప్పు’ అంటూ చిందులేశారు. గుట్కా తిని క్యాన్సర్‌తో చచ్చిపోతావంటూ నానికి శాపనార్థ్ధాలు పెట్టారు.   

Advertisement
Advertisement