చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

Published Sun, Apr 14 2024 6:17 AM

three boys died while swimming in the pond - Sakshi

మాక్లూర్‌: చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం ఒడ్డేట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్‌ (20), తిరుపతి(19), నరేశ్‌ (20), సాయితేజ, వినోద్‌లు శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే చెరువులో మొరం కోసం తవ్విన లోతైన గుంతలు ఉన్నాయి. ఈ విషయం తెలియని మహేశ్, తిరుపతి, నరేశ్‌ చెరువులోకి దిగిన వెంటనే లోతైన గుంతల్లోకి జారి మునిగి పోయారు. ఒడ్డునే ఉన్న సాయితేజ, వినోద్‌ వెంటనే తేరుకుని గ్రామంలోనికి వెళ్లి సమాచారం ఇచ్చారు.

పెద్దఎత్తున గ్రామస్తులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురూ మృతిచెందడంతో గజ ఈతగాళ్లతో ముగ్గురి మృత దేహాలను బయటకు తీయించారు. మృతుల తల్లిదండ్రులకు వారు ఒక్కొక్కరే సంతానం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల్లో తిరుపతి 10వ తరగతి, నరేశ్, మహేశ్‌లు ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. మాక్లూర్‌ ఎస్సై సుధీర్‌రావు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని ట్రెయినీ ఐపీఎస్‌ అధికారి చైతన్యరెడ్డి, నార్త్‌జోన్‌ సీఐ సతీశ్‌ పరిశీలించారు.

Advertisement
Advertisement