లొంగుబాటలో అన్నలు | Sakshi
Sakshi News home page

లొంగుబాటలో అన్నలు

Published Sat, Sep 18 2021 2:25 AM

Top Women Maoist Leaders Willing To Surrender: DGP Mahender Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తుపాకీ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం సాధ్యం కాదని మావోయిస్టులు గ్రహించారని, దీంతో లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఆజాద్, రాజిరెడ్డిలాంటి అగ్రనేతలు సైతం జన జీవన స్రవంతిలో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన మావోయిస్టు కీలక నేత హరిభూషణ్‌ సతీమణి సమ్మక్క అలియాస్‌ శారద పోలీసులకు లొంగిపోయారు.

శుక్రవారం ఆమెకు రూ.5 లక్షల చెక్కును డీజీపీ అందజేశారు.  ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అనారోగ్యం, కోవిడ్‌ సహా సీజనల్‌ వ్యాధులు చుట్టుముట్టడంతో లొంగుబాటుకు మావో యిస్టుల నుంచి పెద్ద ఎత్తున సంకేతాలు వస్తున్నాయని వివరించారు. మహబూబ్‌బాద్‌ జిల్లా గంగారం గ్రామానికి చెందిన సమ్మక్క  మైనర్‌గా ఉన్నప్పుడే   హరిభూషణ్‌ ప్రోద్బలంతో పార్టీలో చేరింది. ఆ తర్వాత అతన్నే వివాహం చేసుకుంది. పార్టీ సిద్ధాంతాలతో విభేదించి 2008లో లొంగిపోయింది. అయితే, మరో పెళ్లి చేసుకుంటా నని హరిభూషణ్‌ బెదిరించడంతో 2011లో మళ్లీ పార్టీలోకి వెళ్ళింది. హరిభూషణ్‌ ఇటీవల చనిపోవడంతో తిరిగి లొంగిపోయింది.  

రాజు మృతిపై సందేహాలకు తావులేదు 
బాలికపై హత్యాచారానికి పాల్పడిన రాజు మృతిపై సందేహాలకు ఏమాత్రం తావు లేదని డీజీపీ స్పష్టం చేశారు. ‘మత్తుమం దుల వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’అని తెలిపారు. 

Advertisement
Advertisement