Why MP Sidhi Urination Incident Victim Seeks Release of Accused - Sakshi
Sakshi News home page

మూత్రవిసర్జన ఘటన.. ఆ ఘటన ఎప్పటిదో!.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన బాధితుడు

Published Sat, Jul 8 2023 4:52 PM

Why MP Sidhi urination incident victim seeks release of accused - Sakshi

ఇవాళ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. సంతోషం.. కానీ కొన్నాళ్ల పోయాక ఈ ఘటన నుంచి మీడియా, పోలీసులు, ప్రజలందరి దృష్టి మళ్లిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి.. భయంతో బతకాల్సిందేనా?.. అంటూ తన పూరి గుడిసె ముందు కూర్చుని కళ్లలో భయంతో ప్రశ్నిస్తున్నాడు 35 ఏళ్ల దశ్మత్‌ రావత్‌. 

మధ్యప్రదేశ్‌ సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న హేయనీయమైన ఘటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కుబ్రి గ్రామానికి చెందిన గిరిజనుడైన దశ్మత్‌ రావత్‌పై ప్రవేశ్‌ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేయడం.. ఆ వీడియో కాస్త విపరీతంగా వైరల్‌ కావడం తెలిసిందే. ఈ ఘటన పెనుదుమారం రేపగా.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితుడి ఇంటికి సంబంధించి కొంత పోర్షన్‌ను అక్రమ కట్టడంగా పేర్కొంటూ బుల్డోజర్‌ కూల్చేయించింది. ప్రవేశ్‌ను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టింది కూడా. ఇక ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సైతం బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణ కోరడంతో ఈ ఘటన ఇంకా హైలెట్‌ చర్చగా మారింది. 

అయితే ఈ ఘటనలో  ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు ప్రవేశ్‌ శుక్లాను విడిచిపెట్టాలంటూ దశ్మత్‌ రావత్‌.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాడు. ‘జరిగిందేదో జరిగింది. అతను తన తప్పు తెలుసుకున్నాడు. ఇకనైనా అతన్ని క్షమించి వదిలిపెట్టాలి అని మీడియా ద్వారా రావత్‌ ప్రభుత్వాన్ని కోరాడు. 

అతను చేసింది తప్పే కదా అని మీడియా అడగ్గా.. ‘‘అవునూ.. అతను చేసింది ముమ్మాటికీ తప్పే. అది నేనూ ఒప్పుకుంటా. అతను మా ఊరి పూజారి. అందుకే అతన్ని విడుదల చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని రావత్‌ చెబుతున్నాడు. పైగా ఆ ఘటన ఈ మధ్య జరిగింది కాదని.. ఎప్పుడో 2020లో జరిగిందని చెప్పాడను. అది 2020లో. ఓ రాత్రిపూట పదిగంటల సమయంలో ఓ దుకాణం వద్ద నేను కూర్చు‍న్నా. అతను నా దగ్గరకు వచ్చి నాపై మూత్రం పోశాడు. ఆ సమయంలో నేను అతని ముఖం కూడా చూడలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. తన తప్పు తాను తెలుసుకున్నాడతను.  మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటోంది ఒక్కటే.. అతన్ని విడిచిపెట్టి మా ఊరికి మంచి రోడ్డు వేయమని అని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడతను. 

ఇప్పుడంటే ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, మీడియా తనకు ధైర్యం చెబుతుందని, కొన్నాళ్లకు అందరూ విషయం మర్చిపోయిన తర్వాత వాళ్లు మామీద కక్ష సాధిస్తే ఎవరు బాధ్యులని ఆందోళన వ్యక్తం చేశాడు. తాము, తమ పిల్లలు సంతోషంగా ఉండాలంటే మాకు ఎవరితో గొడవలు వద్దని అన్నాడు. అందుకే జరిగిందేదో జరిగింది నిందితుడిని వదిలేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపాడు. మరోవైపు రోజు 100, 200 రూపాయలు సంపాదిస్తేనేగానీ తమ కుటుంబం గడవదని.. అలాంటిది ఊరిలో ఎవరితో తమకు శత్రుత్వం వద్దని భార్య ఆశా సైతం వాపోతోంది. 

ఇదిలా ఉంటే.. మూత్ర విసర్జన ఘటన పెనుదుమారం రేపడం వెనుక రాజకీయ విమర్శలు కారణం అయ్యాయి. నిందితుడు బీజేపీకి చెందిన వ్యక్తి అంటూ కాంగ్రెస్‌.. కాదు కాంగ్రెస్‌వి ఉత్త ఆరోపణలే అని బీజేపీ పరస్పరం విమర్శించుకున్నాయి. ఇక బాధితుడు రావత్‌ కాళ్లను సీఎం చౌహాన్‌ కడగడాన్ని కూడా కాంగ్రెస్‌ డ్రామాగా అభివర్ణించింది. 

ప్రభుత్వంపై బ్రహ్మణ సంఘాల మండిపాటు
నిందితుడు శుక్లా ఇంటి పోర్షన్‌ను అక్రమ భాగమంటూ కూల్చివేయడంపై బ్రహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. శుక్లా చేసింది పాపపు పనే అయినప్పటికీ.. ఆయన కుటుంబ సభ్యులను శికక్షించాల్సిన అవసరం ఏముందంటూ నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఐపీసీ సెక్షన్లతో పాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు నేషనల్‌ సెక్యూరిటీ చట్టం కింద ప్రవేశ్‌ శుక్లాపై కఠినమైన నేరారోపణలు నమోదు అయ్యాయి. 

Advertisement
Advertisement