Warangal: Young man commits suicide while talking with lover on call - Sakshi
Sakshi News home page

లవ్‌ ఫెయిల్యూర్‌.. ప్రేమికురాలితో ఫోన్‌లో మాట్లాడుతూనే

Published Tue, Aug 1 2023 10:20 AM

Young man Commits suicide While talking With Lover On Phone warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: ప్రేమికురాలితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఓ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌ నగరంలోని బొల్లికుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఖిలావరంగల్‌ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన జున్న చేరాలు కుమారుడు జున్న గణేష్‌(25) ఖోఖోలో జాతీయస్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడు. ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో పీపీడీ చదువుతున్నాడు.

గణేష్‌కు ఐనవోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులకు తెలిసింది. దీంతోవారు ఆదివారం సాయంత్రం ఆగ్రహంతో బొల్లికుంటకు వచ్చి గణేష్‌ను బెదిరించారు. దీంతో ప్రేమ విఫలమైనట్టేనని మనస్తాపానికిలోనైన గణేష్‌ సోమవారం ఉదయం 11 గంటలకు కుటుంబసభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ప్రేమికురాలతో మాట్లాడుతూ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, ఫ్యాన్‌కు వేలాడుతూ గణేష్‌ మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి చేరాలు సమాచారంతో ఎస్‌ఐ కృష్ణవేణి సంఘటనా స్థలికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను తల్లిదండ్రుల నుంచి సేకరించింది. గణేష్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌ తెలిపారు. ప్రేమికురాలితో ఫోన్‌లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్న అంశంపై పోలీసులను వివరణ కోరగా, గణేష్‌ ఉరి వేసుకున్న చోట ఫోన్‌కింద పడి ఉందని, దీనిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు. 
చదవండి: తాగి ఊగుతూ.. ఊగి ఆగతూ.. ఆగి తన్నుకుంటూ.. ఆకతాయిల వీరంగం!

Advertisement
Advertisement