నీ బాగోతం తెలుసు.. పరువు తీస్తా!  | Sakshi
Sakshi News home page

నీ బాగోతం తెలుసు.. పరువు తీస్తా! 

Published Sat, Mar 11 2023 2:27 AM

Young Woman Commits Suicide due to Harassment by her Boyfriend - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొంగరకలాన్‌ తండాకు చెందిన అంగోతు సరిత, అంతిరాం దంపతుల రెండో కుమార్తె పల్లవి (21). ఈమె వండర్‌లాలో ఉద్యోగం చేస్తోంది. హైదరాబాద్‌ మూసాపేటకు చెందిన ఎలుక క్రాంతి, కొంగరకలాన్‌లో ఉంటున్న తన అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు.

రెండేళ్ల క్రితం పల్లవి, క్రాంతి  మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా.. వండర్‌లాలో పనిచేస్తున్న ప్రణయ్‌తో పల్లవి చనువుగా ఉంటోందని, ఫోన్‌లు, చాటింగ్‌ చేస్తోందని క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో రెండు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో క్రాంతి గురువారం పల్లవిని కలిసి బైక్‌పై సాయిబాబా గుడి వద్దకు తీసుకెళ్లాడు.

‘నీ బాగోతం అంతా నాకు తెలుసు.. అందరికీ చెప్పి పరువు తీస్తా’అని బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన పల్లవి.. ‘ఐ లవ్‌యూ.. లాస్ట్‌ మెసేజ్‌’ అని క్రాంతికి వాట్సాప్‌ చేసింది. అనంతరం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలాన్ని డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం బందోబస్తు మధ్య పల్లవి అంత్యక్రియలు పూర్తి చేశారు. 

పోలీసుల అదుపులో ఇద్దరు  
ఇంటికి వెళ్లకుండా పల్లవి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడం, ఇదే చివరి మెసేజ్‌ అని పెట్టడంతో క్రాంతికి అనుమానం వచ్చింది. దీంతో అతను ఆదిబట్ల పోలీసులకు తెలిపాడు. పల్లవి అత్మహత్య చేసుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులకు తెలియడంతో వారు కూడా పోలీసులను ఆశ్రయించారు.

అర్ధరాత్రి రెండు గంటల వరకు వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. శుక్రవారం పల్లవి చెట్టుకు ఉరేసుకొని కని పించింది. కూతురు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా, క్రాంతి, ప్రణయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  

Advertisement
Advertisement