ఉప్పలగుప్తం: తీర ప్రాంతంలో ఉన్న పర్ర భూములను డ్రెడ్జింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో వసంతరాయుడు అన్నారు. కొన్ని రోజులుగా మండలంలోని ఎస్.యానం తీర ప్రాంతంలో తరచూ చేపలు చనిపోవడంతో ‘సాక్షి’ దినపత్రికలో ‘నీటిలోని చేప నేల మీద పడ్డట్టు’ శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ హిమాన్షుశుక్లా స్పందించారు. ఆయన ఆదేశాలతో మంగళవారం ఆర్డీవో పర్రభూమిని సందర్శించారు. డ్రెడ్జింగ్ నిపుణులు కామ్రెన్, మత్స్యశాఖ జేడీ షేక్ లాల్మహ్మద్ తహసీల్దార్ జె.వెంకటేశ్వరితో కలసి తీర ప్రాంతం వెంబడి పర్యటించి పరిశీలించారు.
అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎస్.యానం పర్రకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర మౌత్ పాయింట్ వద్ద కూనవరం మేజర్ డ్రెయిన్ ప్రాంతం నుంచి ఎస్.యానం పర్రకు డ్రెడ్జింగ్ పనులు జరిపినా ఉపయోగం ఉండదన్నారు. అల్లవరం మండలం నక్కా రామేశ్వరం మౌత్ పాయింట్ నుంచి నాచుకోడుకు ఇప్పటికే అరకొరగా నీరు కదలిక ఉండటంతో ఆ ప్రాంతాన్ని 2.5 మీటర్ల లోతుతో 50 మీటర్ల వెడల్పుతో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం డ్రెడ్జింగ్ జరిపితే పర్రకు నీరు అందే అవకాశం ఉందన్నారు. మత్స్య సంపద చనిపోవటంపై ఇప్పటికే మట్టి, నీటి నమూనాల పరిశీలనకు ల్యాబ్కు పంపామని తెలిపారు.
వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ఉషారాణి
కొత్తపేట: వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సత్తి రాజు ఉషారాణి నియమితులయ్యారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.