పెద్దాపురం: స్థానిక జవహార్ నవోదయ విద్యాలయలో 9, 11వ తరగతి ప్రవేశ పరీక్షల దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు తేదీ పొడిగించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.రామకృష్ణయ్య తెలిపారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ ఈ నెల 7వ తేదీతో ముగిసిన గడువు తేదీని మరో వారం రోజలు పెంచుతూ విద్యాలయ సమితి నిర్ణయం తీసుకుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని రామకృష్ణయ్య తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రామచంద్రపురం రూరల్: సుమారు 55 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తరువాత చోడవరం వెళ్లే రోడ్డు పక్కన మృతి చెంది ఉన్నాడని రామచంద్రపురం ఎస్సై డి.సురేష్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీఆర్ఓ కాగితపల్లి కనకదుర్గ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్టు, నాచు రంగు ఫుల్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఎవరికై నా మృతుని వివరాలు తెలిస్తే 08857 242333, 94407 96589 ఫోన్ నంబర్లలో తెలియజేయాల్సిందిగా కోరారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
రూ.1.40 లక్షల నగదు, 3.5 కాసుల బంగారం అపహరణ
కొత్తపేట: ఇంటికి తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి నగదు, బంగారం చోరీకి పాల్పడ్డారు. ఎస్సై వీ మణికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అవిడి గ్రామంలో అన్నదమ్ములు దూళి వెంకటేశ్వరరావు, దూళి సుబ్రహ్మణ్యం ఒక ఇంట్లోని వేరు వేరు పోర్షన్లలో నివాసం ఉంటున్నారు. వారు కుటుంబ సభ్యులతో సహా సోమవారం ఉదయం ఐ.పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో బంధువుల ఇంటికి ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఆ అన్నదమ్ముల పోర్షన్ల బయట తలుపులు పగులకొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా రెండు పోర్షన్లలో బీరువాలు తెరిచి వాటిలో సామాన్లు చిందరవందరగా పడివున్నాయి. బీరువాలలో పరిశీలించగా భద్రపరిచిన నగదు, బంగారం వస్తువులు కనిపించలేదు. అవి అపహరణకు గురయినట్టు గుర్తించారు. అలా వెంకటేశ్వరరావు ఇంట్లో రూ.45 వేలు నగదు, మూడున్నర కాసుల బంగారం వస్తువులు, సుబ్రహ్మణ్యం ఇంట్లో రూ.95 వేలు నగదు చోరీకి గురయింది. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై మణికుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించింది. బాధిత అన్నదమ్ములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.