నల్లజర్ల: అక్రమంగా రవాణా చేస్తున్న 26 టన్నుల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయి అధికారులు మంగళవారం పట్టుకున్నారు. సివిల్ సప్లయి డీటీ నత్యనారాయణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా గణపవరం నుంచి శ్రీనివాస ట్రేడర్స్ ఆధ్వర్యంలో 520 బస్తాల్లో (50 కిలోలు) లారీలో రవాణా చేస్తుండగా సివిల్ సప్లయి,రెవెన్యూ అధికారులు నల్లజర్ల వద్ద ఆపి సరకును స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవరు వర్రి క్రాంతిని సరకు ఎవరిదని అడుగ్గా కాకినాడ పోర్టు వద్దకు వెళ్లాక ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడని సరకు అక్కడ దింపాలని చెప్పారన్నారు. లారీ ఒంగోలుకు చెందిన అడుసుమిల్లి కోటేశ్వరావుదిగా గుర్తించారు. 6ఏ కేసు నమోదు చేసి బియ్యాన్ని గోపాలపురం ఎంఎల్ఎస్ పాయింటుకు అప్పగించారు. అనంతరం 7(1)గా కేసు మార్పు చేసి లారీ డ్రైవరు, ఓనర్లపై కేసులు నమోదు చేస్తామని సీఎస్ డీటీ సత్యనారాయణరావు తెలిపారు. ఈ దాడిలో ఆయనతోపాటు వీఆర్వోలు లక్ష్మణమూర్తి, సురేష్, వీఆర్ఏ సత్యనారాయణ ఉన్నారు.
పెద్దాపురంలో కారు బీభత్సం
ముగ్గురికి తీవ్ర గాయాలు
పెద్దాపురం: అనుభవం లేని వ్యక్తి కారు డ్రైవ్ చేయడంతో ముగ్గురు గాయాల పాలైన ఘటన మంగళవారం ఉదయం పెద్దాపురం దర్గా సెంటర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం డ్రైవింగ్లో అనుభవం లేని బంగారమ్మ గుడి వీధికి చెందిన ముప్పన వీరభద్రం సరదాగా కారు నడిపి నాలుగు బైక్లు, ఆటోను బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో అంబిక, సమ్మంగి దేవి, మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అజాగ్రత్తగా కారు నడిపిన వీరభద్రంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దాపురం ఎస్ఐ వి.సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.