ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతి కెక్కిన వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజాధిరాజ అలంకరణలో గజవాహనంపై ఊరేగించారు. ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఖండవల్లి రాజేశ్వర వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పూజలు, సేవలు శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఎస్సై బీవై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
నేటి కార్యక్రమాలు
గురువారం ఉదయం స్వామివారికి విష్వక్సేనపూజ, పుణ్యహవచనం, తిరుప్పావడ సేవ, చూర్ణోత్సవం, ప్రధాన హోమాలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వస్తి వచనం, ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, నీరాజనం, కల్కి అలంకరణతో అశ్వవాహన సేవ తదితర పూజా కార్యక్రమాలు జరుపుతారు.