ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అనగానే ఇటు ఆధ్యాత్మికానికి.. అటు పర్యాటకానికి ప్రత్యేకం. ముఖ్యంగా కార్తికమాసంలో ఆలయాల వద్ద భక్తులు, బీచ్ల వద్ద పర్యాటకుల తాకిడి అధికం. నెలరోజుల పాటు జిల్లాలో ప్రముఖ ఆలయాల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా పురాణ ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉమ్మడి జిల్లాలో అధికం. వీటిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయం ఒకటి. పంచారామ క్షేత్రాలలో ఇదొకటి. దీనిని తొమ్మిది, పది శతాబ్దాల మధ్య నిర్మించారు. ఇక్కడ కార్తికమాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. దీనితోపాటు కోటిపల్లి సోమేశ్వరస్వామి, ముక్తేశ్వరంలో క్షణ ముక్తేశ్వరస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, కడలి కపోతరేశ్వరస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కోటిపల్లి, ముక్తేశ్వరానికి వచ్చే భక్తులు ఆలయాల సమీపంలోని గోదావరి నదీపాయలు, పంట కాలువల్లో పుణ్యస్నానాలు చేసి ఆలయాల్లో దైవదర్శనానికి వెళుతుంటారు. ఈ ఆలయాలకు సోమవారాలలో భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాలలో ఉన్న శివాలయాలకు సైతం భక్తుల తాకిడి అధికం. ఇందుకు తగినట్టుగా ఆయా ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో అయినవిల్లి శ్రీ వరసిద్ధివినాయకుని ఆలయం, అంతర్వేది శ్రీ లక్ష్మీ నర్శింహస్వామి, వాడపాలెం వేంకటేశ్వరస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, అమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.