ఎమ్మెల్సీగా కుడుపూడి ప్రమాణ స్వీకారం | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీగా కుడుపూడి ప్రమాణ స్వీకారం

Published Tue, May 16 2023 9:22 AM

- - Sakshi

అమలాపురం టౌన్‌: పట్టణానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు అమరావతిలో సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై న విషయం తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, బీసీ నేతలు సోమవారం తరలివెళ్లారు. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో శ్రీజై సూరిశ్రీ అంటూ నినాదాలు చేశారు.

రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్‌పర్సన్‌ కుడుపూడి సత్యశైలజ, అమలాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ అమలాపురం అధ్యక్షుడు సంసాని బులినాని, జిల్లా వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, అయినవిల్లి జెడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, ఉభయ గోదావరి జిల్లాల బీసీ సంఘాల నేతలు కోడి దుర్గాప్రసాద్‌, కుక్కుల శ్రీనివాసరావు, వాసంశెట్టి తాతాజీ, కుడుపూడి త్రినాథ్‌, కాండ్రేగుల గోపి తదితరులు అమరావతి వెళ్లారు.

నేడు 40 కిలోమీటర్ల మేర ఊరేగింపు
ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం కుడుపూడి సూర్యనారాయణరావు తొలిసారిగా మంగళవారం మధ్యాహ్నం జిల్లాకు రానున్నారని వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు భారీ ఊరేగింపుతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నివాసం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపు మొదలవుతుందన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి ఊరేగింపు వాహనంపై మంత్రులు పినిపే విశ్వరూప్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశీనులవుతారని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు పాల్గొని ఈ ఊరేగింపును విజయవంతం చేయాలని బులినాని విజ్ఞప్తి చేశారు.

1/1

Advertisement
Advertisement