● వాటి లైసెన్సులు రద్దు
● పాఠశాలల పునఃప్రారంభం నాడే
జగనన్న విద్యా కానుక
● విద్యా శాఖ మంత్రి బొత్స హెచ్చరిక
దేవరపల్లి: విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేసే కళాశాలలను సీజ్ చేస్తామని, వాటి లైసెన్స్ రద్దు చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. దేవరపల్లి మండలం పల్లంట్లలో వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ పరిశీలకుడు గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ) నివాసంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మా ట్లాడారు. ఇంజినీరింగ్, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద మూడో త్రైమాసిక నిధులు జమ చేశామని చెప్పారు. వీరికి ఆగస్టులో విడుదల చేయాల్సిన నాలుగో విడత జగనన్న విద్యా దీవెన నిధులను కూడా ముందుగానే జమ చేశామని, ఈ మేరకు జీఓ కూడా విడుదల చేశామని తెలిపారు. ఈ ఏడాది జమ చేసిన నిధులను వెంటనే ఆయా కళాశాలలకు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరిచే రోజునే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తామని మంత్రి చెప్పారు. మన బడి నాడు – నేడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని, మొదటి విడత పనులు దాదాపు పూర్తి కాగా, రెండో దశ పనులు జరుగుతున్నాయని, దీనికి నిధుల కొరత లేదని తెలిపారు. కొన్ని పాఠశాలల వద్ద అవసరానికి మించి తరగతి గదులు మంజూరయ్యాయని, వాటిని గుర్తించి పునాదుల దశలోనే నిలిపివేశామని చెప్పారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తన దృష్టికి తీసుకురావాల ని బొత్స కోరారు. దేవరపల్లి మండలం యర్నగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించి నాలుగేళ్లవుతోందని, ఇంతవరకూ తరగతి గదులు, ఫర్నిచర్ సమకూర్చలేదని కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, రాష్ట్ర పామాయిల్ బోర్డు డైరెక్టర్ నరహరిశెట్టి రాజేంద్రబాబు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రేకుల షెడ్డు లో తరగతులు నిర్వహిస్తూండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరు తరగతి గదులు, ఫర్నిచర్కు నిధులు మంజూరు చేయాలని రాజేంద్రబా బు కోరారు. ఈ మేరకు కళాశాలకు ఆరు తరగతి గదు లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై పార్టీ నాయకులను ఆయన ఆరా తీశారు. కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రికి నాయకులు, రైతులు తెలిపారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), ఏఎంసీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, ఎంపీపీ కేవీఏ దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యురాలు పొట్టి స్వర్ణలత, వైస్ ఎంపీపీ సాదే సుబ్బారావు, పార్టీ మండల అధ్యక్షులు కె. సతీష్, మండల మహిళా కన్వీనర్ కడలి హై మావతి, మండల యువజన విభాగం అధ్యక్షుడు ఎ.సూర్యచంద్రరావు, మైనార్టీ చైర్మన్ షేక్ ముస్తఫా పాల్గొన్నారు.