కడియం: మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంక కాలువ రేవులో రవ్వల మోహనరావు అనే 30 ఏళ్ల యువకుడు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం కాలువ రేవులోకి వెళ్లిన మోహనరావు కాలుజారి కాలువలోకి పడిపోయాడు. ఆ తరువాత కన్పించలేదు. దీంతో స్థానికులు అతని కోసం రెండు రోజులుగా వెతుకుతున్నారు. బుధవారం సాయంత్రానికి కూడా ఆచూకీ లభించలేదు. కాలువలో నీటి మట్టం అధికంగా ఉండడం వల్ల గాలించడం కష్టమవుతోందని యువకుడి తండ్రి సంపదరావు చెబుతున్నారు. మోహనరావు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సరీ పనుల నిమిత్తం మోహనరావు, కుటుంబ సభ్యులు శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఇక్కడకు వలస వచ్చారు. మోహనరావు గల్లంతైన నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు, బంధువులు కాలువ రేవులోనే అతని ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నారు.