సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం)/రాజమహేంద్రవరం సిటీ: ఆధ్యాత్మిక మాసంకార్తికం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఆలయాల వద్ద ఆధ్యాత్మికతతోపాటు పర్యాటక సందడి కూడా ప్రారంభమవుతోంది. ముఖ్యంగా కార్తిక సమారాధనలకు వివిధ సంఘాలు, కుల సంఘాలు సమాయత్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం గోదావరి గట్టును ఆనుకుని ఉన్న ఉమా కోటిలింగేశ్వర క్షేత్రం, ఉమా మార్కండేయ స్వామి, సారంగదరేశ్వర ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. సమీపంలోని గోదావరి తీరాన. పుష్కర్ఘాట్, కోటిలింగాల ఘాట్లలో దీపాలు వదలడాన్ని మహిళలు ఎంతో పవిత్రంగా భావి స్తారు. ఇన్సీసుపేటలోని మహా కాళేశ్వరం ఆలయంలో చితా భస్మంతో అభిషేకిస్తారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం కిటకిటలాడుతుంది. గోదావరికి ప్రత్యేక హరతి ఏర్పాటు చేశారు.
పుణ్యస్నానాలకు ఏర్పాట్లను
పరిశీలించిన ఎంపీ
గోదావరి ఘాట్లలో అన్ని ఏర్పాట్లూ చేసినట్టు ఎంపీ భరత్రామ్ తెలిపారు. నగరంలోని కోటిలింగాల, పుష్కర తదితర ఘాట్లను నగరపాలకసంస్థ అధికారులతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఎంపీ మాట్లాడుతూ కార్తిక మాసం నేపథ్యంలో గోదావరి ఘాట్లకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారని, వారికి అనుగుణంగా అన్ని వసతులు కల్పించామన్నారు. పిల్లలు, వృద్ధుల సౌకర్యార్థం జల్లుస్నాన ఘట్టాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం పుష్కరఘాట్ సమీపంలో గల చిత్రాంగి అతిథి గృహాన్ని పరిశీలించారు. అక్కడ చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, పార్టీ నాయకులు మజ్జి అప్పారావు, కోటిలింగాల దేవాలయం చైర్మన్ అరిగెల బాబు, దుంగా మంగ, రామ్ సాయిదీపు, వాకచర్ల కృష్ణ, సప్పా ఆదినారాయణ, ఆర్ఎంసీ ఎస్ఈ పాండురంగారావు, ఈఈలు అలీ, శేషగిరి, ఏఈ పిల్లి ప్రసాద్, శానిటరీ సూపర్ వైజర్ రామలింగారెడ్డి పాల్గొన్నారు.