24 లోపు ఉమ్మడి బ్యాంక్ ఖాతాలు తెరవాలి
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనకు అర్హులైన విద్యార్థులు తల్లితో కలిసి ఈ నెల 24లోపు ఉమ్మడి బ్యాంక్ ఖాతా తెరవాలి. ఎస్సీ విద్యార్థులు, చివరి సంవత్సరం చదివే వారు ఈ ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ఖాతా తెరిచాక ఆ వివరాలను తమ పరిధిలోని సచివాలయాలకు తెలియజేయాలి. ఉమ్మడి బ్యాంకు ఖాతా అకౌంట్ పుస్తకంలోని మొదటి పేజీ కాపీని అందించాలి. నాలుగో విడత విద్యాదీవెన పథకం నగదు విడుదలకు ఈ ప్రక్రియ తప్పనిసరి. సచివాలయ సిబ్బంది ఉమ్మడి బ్యాంక్ ఖాతా వివరాలను నవశకం లాగిన్లో అప్డేట్ చేస్తారు. ఖాతాలు తెరిచే విషయంలో తల్లిదండ్రులు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సచివాలయ సిబ్బంది, బ్యాంక్ మేనేజర్లు సహకరించాలి.
– డీవీ రమణమూర్తి, జాయింట్ డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ
జిల్లా మొత్తం ఖాతాలు
విద్యార్థులు తెరవాల్సినవారు
కాకినాడ 44,524 25,350
కోనసీమ 35,255 17,524
తూర్పు 33,664 18,286
నాలుగో విడత విద్యా దీవెన
కాకినాడ జిల్లా : రూ. 21 కోట్లు.
కోనసీమ జిల్లా : రూ.16 కోట్లు.
తూర్పుగోదావరి : రూ.14 కోట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోంది. తద్వారా పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి మార్గం చూపుతోంది. ఇందులో భాగంగానే జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాలతో సాయపడుతోంది. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని తాజాగా ఆదేశించింది. విద్యా దీవెన కింద ఇంతవరకూ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. ఖాతాల్లో జమయ్యాక ఆ సొమ్మును వారు కాలేజీ యాజమాన్యాలకు ఫీజుగా అందజేస్తున్నారు. ఇలా ఖాతాల్లో నగదు జమయిన విషయం తల్లిదండ్రులు చెబితే తప్ప కొందరు విద్యార్థులకు తెలియడం లేదు. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తూంటే వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థి తో పాటు తల్లి పేరుతో ఉమ్మడి బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ ఈ నెల 24లోగా ఉమ్మడి బ్యాంక్ ఖాతా ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం కింద ఈ నెల 28న ప్రభుత్వం నిధులు జమ చేయనుంది.
ముందుచూపుతో జాగ్రత్తలు
ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ తదితర కోర్సుల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద కోర్సును బట్టి ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకూ ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కింద ఎస్సీ, కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉమ్మడి ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విద్యాదీవెన సొమ్మును ఆధార్ కార్డుల ఆధారంగా ఆన్లైన్లో నేరుగా జమ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సొమ్ము జమ అయింది. చివరి సంవత్సరం మిగిలి ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారనే ముందుచూపుతో ప్రభుత్వం ఇలా మినహాయించింది. బీసీ, ఇతర వర్గాల విద్యార్థులకు మాత్రం విద్యాదీవెనను రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు విడతల సొమ్మును క్రమం తప్పకుండా ఇప్పటికే జమ చేసింది. నెలాఖరులోపు నాలుగో విడత విడుదల చేయనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులు మినహా మిగిలిన అన్ని కేటగిరీల్లో 1,13,443 మందికి సుమారు రూ.51 కోట్ల మేర సాయం అందనుంది.
విద్యాదీవెన’కు
ఉమ్మడి ఖాతా తప్పనిసరి
విద్యార్థులకు నిధుల
జమ తెలిసేలా చర్యలు
సక్రమంగా ఫీజు చెల్లింపునకు మార్గం సుగమం
ఎస్సీ, ఆఖరి ఏడాది
విద్యార్థులకు మినహాయింపు