● రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
● బూరుగుపూడిలో యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం
మధురపూడి: విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో మౌలికమైన మార్పులు తీసుకువచ్చారని రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. కోరుకొండ మండలం బూరుగుపూడి ద్వారకామాయి కల్యాణ మండపంలో యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, సమాజోద్ధరణలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని, అదే దృక్పథంతో ప్రభుత్వం ఉందని అన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక సమస్యల నేపథ్యంలో కొన్ని చిన్న సమస్యలు ఉత్పన్న మయ్యాయని, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నాడు–నేడుతో పాఠశాల లు ఎంతో మెరుగుపడ్డాయని అన్నారు. డీఎస్సీ–2023 వెంటనే అమలు చేయాలని, అలవెన్స్ బేస్ట్ ప్రమోషన్లను విరమించుకోవాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, గౌరవాధ్యక్షుడు వి.శంకరుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వరరావు, అరుణకుమారి, సీఐటీయూ జిల్లా నాయకులు అరుణ్, కోరుకొండ మండలాధ్యక్షుడు జీవీ శివబాబు తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ
ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.జయకర్, సహాధ్యక్షుడిగా ఐ.రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ఎ.షరీఫ్, సహ కార్యదర్శిగా ఎం.విజయగౌరి, కోశాధికారిగా ఈవీఎస్ఆర్ ప్రసాద్తో పాటు, తొమ్మిది మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు.