ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు 30 వరకూ గడువు | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు 30 వరకూ గడువు

Published Tue, Nov 21 2023 2:52 AM

-

కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ): వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్‌ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్‌, ఫెయిలైన ప్రైవేటు విద్యార్థులందరూ జరిమానా లేకుండా ఈ నెల 30వ తేదీలోగా ఫీజు చెల్లించవచ్చు. ప్రాంతీయ ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎస్‌వీఎల్‌ నరసింహం సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రిన్సిపాళ్లు వారి కళాశాలలో ప్రైవేటు విద్యార్థులకు సంబంధించి ఎంత మంది ఫీజు చెల్లించారు, ఎందరు చెల్లించలేదు, కారణాలేమిటనే వివరాలను తమ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా పంపించాలని ఆదేశించారు. ఫెయిలైన విద్యార్థులందరితో ఫీజు కట్టించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్‌ పాసైన తరువాత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హెచ్‌సీఎల్‌ టెక్‌బీ సంస్థ అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తోందని తెలిపారు. దీనిపై కూడా విద్యార్థులను ప్రిన్సిపాల్స్‌ ప్రోత్సహించి, ఎక్కువ మంది పేర్లు నమోదు చేయించి, వచ్చే నెలలో జరిగే పరీక్షకు సన్నద్ధం చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌కు, పరీక్ష రాసేందుకు ఎటువంటి ఫీజూ లేదన్నారు. వచ్చే నెలలో పరీక్ష జరిగే తేదీ త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. వివరాలకు హెచ్‌సీఎల్‌ టీమ్‌ సభ్యుడు సాయికిరణ్‌ను 96429 73350 సెల్‌ నంబరులో సంప్రదించాలని నరసింహం సూచించారు.

Advertisement
Advertisement