అన్నవరం : కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా శుక్ర వారం రత్నగిరి సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం ప్రాంగణం, వ్రతమండపాలు, క్యూ లైన్లు ఎక్కడ చూసినా జనసందోహం దర్శనమిచ్చింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై 50 వివాహాలు జరిగాయి.
ఆ నవ దంపతులతో పాటు, ఇతర ప్రాంతాలలో వివాహాలతో ఒక్కటైన దంపతులు వారి బంధుమిత్రులు కూడా సత్యదేవుని దర్శనానికి వచ్చారు. భక్తజనానికి పెళ్లిబృందాలు కూడా తోడవడంతో రత్నగిరిపై తీవ్ర రద్దీ ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు సుమారు మూడు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు, కార్తిక పౌర్ణమి, సోమవారం పర్వదినాల సందర్బంగా రత్నగిరికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మూడు రోజులూ కొనసాగనున్న రద్దీ