కొవ్వూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో చిడిపి గ్రామ దళితులకు గోదావరి లంక భూములకు లీజు పట్టాలు అందించామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో మంత్రి వనిత మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో సొసైటీ పేరుతో గోదావరి లంక భూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 65 సెంట్ల చొప్పున 97 కుటుంబాలకు 63 ఎకరాల భూముని అందించామన్నారు. కోర్టు కేసుల వల్ల లబ్ధిదారులైన రైతులు గతంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా నా భూమి అని సగర్వంగా చెప్పుకునేలా పట్టాలు జారీ చేశామన్నారు. తమకు నచ్చిన పంటలను పండించుకునే వెసులుబాటు ఇప్పుడు రైతులకు లభించిందన్నారు. ఐ.పంగిడిలో రోడ్డు మార్జిన్ ఉన్న తమ గృహాలను ఎప్పుడు తొలగిస్తారో తెలియక బిక్కు బిక్కుమంటూ 32 కుటుంబాల వారు మూడు దశాబ్ధాలుగా జీవించారన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, తక్షణమే వారందరికీ పట్టాలు అందించాలని ఆదేశించారన్నారు. జగనన్న ప్రత్యేక జీవో జారీ చయేయ నేడు ఐ.పంగిడిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వగలిగామన్నారు. అనంతరం రెండు గ్రామాల లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. కొవ్వూరు ఆర్డీవో రామావత్ కృష్ణ నాయక్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి వీరన్న, ఐ.పంగిడి సర్పంచ్ గోశాల నాగార్జున, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు సుంకర సత్యనారాయణ, చిడిపి ఎంపీటీసీ సభ్యుడు నడిపల్లి అప్పారావు, పార్టీ నాయకుడు పామెర్ల నగేష్, కాపవరం సొసైటీ మాజీ అధ్యక్షుడు కామన రత్నాజీ తదితరులు పాల్గొన్నారు.