కంట్రోల్ రూమ్ నంబర్లు : 8309487151, 0883–2940788
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): మిచాంగ్ తుపాను కారణంగా ప్రస్తుతానికి ఆఫ్లైన్లో కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తేజ్భరత్ తెలిపారు. ఇప్పటివరకు రైతుల నుంచి 8,799 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మంగళ వారం నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి 24,431 కూపన్లను జనరేట్ చేశామని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 15,754 మంది రైతుల నుంచి 1,09,437.080 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని దింపుకునేందుకు మిల్లుల దగ్గర ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాకు 63,00000 గోనె సంచులు అవసరం కాగా ఇప్పటికే 54,72567 సంచులు ఆర్బీకేలలో సిద్ధం చేశామన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై సందేహాలు, ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
అధైర్యపడకండి.. అండగా ఉంటాం : జక్కంపూడి రాజా
రాజానగరం: తుపాను ప్రభావంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరికీ ఎటువంటి నష్టం, కష్టం వాటిల్లకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా భరోసా ఇచ్చారు. చేతికి అందివచ్చిన వరి పంట గురించి అన్నదాతలు ఆందోళన చెందవద్దన్నారు. మిచాంగ్ తుపాను నేపథ్యంలో నియోజకవర్గంలోని పరిస్థితుల పై వివిధ శాఖ ప్రభుత్వ అధికారులతో స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి మంగళవారం టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే కోతలు కోసి, రైతుల వద్ద ఉంచిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలావరకు ఖరీఫ్ వరి పంట కోతలు పూర్తయియ్యాయన్నారు. అక్కడక్కడా కోతలు జరగాల్సిన చోట ప్రస్తుత సమయంలో కోతలు చేపట్టవద్దని సూచించారు. ఈ వర్షాలు, గాలులకు ఎక్కడైన పంట నేలకొరిగితే సంబంధించిన నివేదికలు సిద్ధం చేస్తున్నారన్నారు. తీవ్ర గాలుల కారణంగా చెట్లు, కొమ్మలు విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలన్నారు.
నేడు ఫెన్సింగ్
క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటి): జిల్లా ఫెన్సింగ్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లాస్థాయి జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగంలో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. అండర్–14, 17 విభాగాల్లో బాలురు, బాలికల జట్లు ఎంపిక జరుగుతుందన్నారు. అండర్–14 విభాగంలో 1–1–2010 తరువాత పుట్టిన వారు, అండర్–17 క్యాడిట్ విభాగంలో 1–1–2007 నుంచి 30–11–2010 మధ్యలో పుట్టిన వారు అర్హులన్నారు.