కడియం: తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తమైందని కలెక్టర్ మాధవీలత చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దన్నారు. కడియం మండలం మురమండలో మంగళవారం ఉదయం ఆర్డీవో చైత్రవర్షిణితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. రైతులతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంతో పాటు, అన్ని మండల కేంద్రాల్లోను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలకు ఆదేశాలిచ్చామన్నారు. ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లులకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంకా కళ్లాల్లో ధాన్యం ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా కంట్రోల్రూముకు సమాచారం అందించాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెండు మూడు రోజులపాటు వరి కోతలు చేపట్టవద్దని రైతులను కోరారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించే క్రమంలో రూట్ క్లియరెన్స్ బృందాలను కూడా సిద్ధం చేశామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ పునరుద్ఘాటించారు. అంతకు ముందు రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై ఆమె ఆరాతీశారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ సుజాత, ఏఓ ద్వారాకదేవి, ఆయా శాఖల సిబ్బంది ఉన్నారు.
జిల్లా కలెక్టర్ మాధవీలత