రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యాశిక్షణాసంస్థ(డైట్)లో రెండురోజుల పాటు జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా స్థాయి కళాఉత్సవ్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. చిత్రలేఖనం,మట్టితో బొమ్మల తయారీ,సాంప్రదాయ ఆటబొమ్మల తయారీ, ఏకపాత్రాభినయం విభాగాల్లో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ పోటీలను డైట్ ప్రిన్సిపాల్ డా.ఎస్డీవీ రమణ ప్రారంభించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది పాఠశాలల నుంచి 22మంది బాలబాలికలు పోటీలలో పాల్గొన్నారని రమణ తెలిపారు. బాలబాలికలలో అంతర్లీనంగా దాగి ఉన్న కళా నైపుణ్యాలు వెలికితీయటానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. రెండు రోజులు జరిగిన ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కె.టి.సుబ్బరాయన్,ఎం.నాగేశ్వరరావు,కరణం నూకరాజు,పి.పి.యస్.జోగన్న శాస్త్రి వ్యవహరించారు. అధ్యాపకులు సూర్యనారాయణ, సత్యనారాయణ, బాలరాజు,జానకీదేవి,ఎస్తర్,కళావతిలు పాల్గొన్నారు.
విజేతలు వీరే...
రెండవ రోజు పోటీలలో చిత్రలేఖనం బాలుర విభాగంలో పి.ధనరాజు(కాకినాడ), బాలికల విభాగంలో కె.లీలాశృతి(మండపేట), మట్టిబొమ్మల తయారీ బాలుర విభాగంలో పి.రాజు(కాకినాడ), బాలికల విభాగంలో ఆర్.మౌనిక(మండపేట) సాంప్రదాయ ఆటబొమ్మల తయారీ బాలుర విభాగంలో ఎస్.సాయి(కాకినాడ), బాలికల విభాగంలో వి.శివలీల(మండపేట), ఏకపాత్రాభినయం బాలుర విభాగంలో బి.సుధీర్కుమార్(ఉండూరు), బాలికల విభాగంలో వైఎస్ఎస్ఎం.పవిత్ర(,కడియం) ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. వీరు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డా రమణ వివరించారు.