తాడేపల్లిగూడెం: తైవాన్లోని నేషనల్ సన్ యట్–సెన్ యూనివర్సిటీకి చెందిన ఆచార్యులు డాక్టర్ హెచ్డీ యాంగ్, డాక్టర్ కాకర్ల దేవి చంద్రశేఖర్ గురువారం ఏపీ నిట్ కళాశాలను సందర్శించారు. ఇండియా, తైవాన్ సహకార ప్రాజెక్టులో భాగంగా నిట్ ప్రాంగణంలోని ప్రయోగశాలలు, భవనాలను తైవాన్ ఆచార్యులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో యాంగ్ మాట్లాడుతూ సూపర్ కండక్టివిటీ అభివృద్ధి, విద్యుత్శక్తి సరఫరా, ఎలక్ట్రికల్ వాహనాల ఉపయోగం, వాటి ప్రాధాన్యతను వివరించారు. ఆచార్యులు కాకర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇండో–తైవాన్ ప్రాజెక్టులో భాగంగా ఏపీ నిట్, ఎన్ఎస్వైఎస్ యూనివర్సిటీల మధ్య సత్సంబంధాలు, భవిష్యత్ ప్రయోజనాలను వివరించారు. ఉద్యోగావకాశాలు, దరఖాస్తు చేసుకునే విధానాలపై విద్యార్థులకు తెలియజేశారు. నిట్ ఆచార్యుడు డాక్టర్ జి.కృష్ణమూర్తి తాను చేస్తున్న ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు. డీన్లు శాస్త్రి, జయరామ్, ఆచార్యులు సందీప్, అరుణ్కుమార్, తపస్, రాముడు, సుదర్శన్, అమరేంద్ర, శరత్, సురేంద్ర పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
ఉండి: గోదావరి జిల్లాల్లో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా రైతులను, ఔత్సాహికులను ప్రోత్సహిద్దామని గోదావరి మండలాల సహపరిశోధనా సంచాలకురాలు భరతలక్ష్మి అన్నారు. గురువారం ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులు, వినియోగదారులు, వ్యాపారవేత్తల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భరతలక్ష్మీ, జిల్లా వ్యవసాయాధికారి జడ్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం వరిలో ఉధృతంగా ఉన్న తెల్లదోమ.. రసాయన పురుగుమందులు వాడటం వల్లనే వస్తోందన్నారు. నాణ్యమైన, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారులను, వినియోగదారులను అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. ఆ యుర్వేద ఉత్పత్తుల నుంచి విలు వ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. సేంద్రియ ఉత్పత్తిదారులు సేంద్రియ ధ్రువీకరణ పత్రాలు చేయించుకుంటే అధిక ధరలను పొందవచ్చన్నారు. అనంతరం రైతులు, వినియోగదారులు, వ్యాపారులతో మాట్లాడారు. డాక్టర్ ఎ.శ్రీరామ్, శాస్త్రవేత్తలు ఎన్.దెబోరామెస్సియానా, ఎ.శ్రీనివాసరావు, ఎ.రాజేష్, పీ వినయలక్ష్మి, బీ రజిత, ఏడీఏ శ్రీనివాస్ పాల్గొన్నారు.