ఏలూరు (టూటౌన్): ఆర్థికంగా వెనుబడిన బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం దూరం కాకూడదనే ఉద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేశామని మొదటి అదనపు జిల్లా జడ్జి జి.రామ్ గోపాల్ అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్లో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మొదటి అదనపు జిల్లా జడ్జి జి.రామ్ గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చట్టాల గురించి న్యాయసేవాధికార సంస్థ న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి ప్రజలలో అవగాహన పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలలో ప్రశ్నించే తత్వం, ఆచరించే తత్వం కలిగి ఉంటే సమాజం మెరుగుపడుతుందని అన్నారు. రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగాకుమారి, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్ కుమార్ మాట్లాడుతూ నవంబరు 9న న్యాయసేవాధికార సంస్థ పుట్టినరోజును ప్రపంచం అంతటా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి మనిషి తన హక్కులకు, ఇతరుల హక్కులకు భంగం కలుగకుండా ఉండాలన్నదే న్యాయసేవాధికార సంస్థ ఉద్దేశ్యమన్నారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ.మేరీగ్రేస్ కుమారి మాట్లాడుతూ పర్మినెంట్ లోక్ అదాలత్ను 2002లో ప్రవేశపెట్టగా పశ్చిమగోదావరి జిల్లాలో 2023 మార్చి 1 నుంచి ఏలూరులో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు బీవీ కృష్ణారెడ్డి, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.విజయకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కెకెవి బుల్లి కృష్ణ మాట్లాడారు. అదనపు జిల్లా జడ్జి జి.రామ్గోపాల్ తో పాటు పలువురు న్యాయమూర్తులు జ్యోతి ప్రజ్వలన చేశారు.