ముసునూరు: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు స్థానిక ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల విద్యాలయం తొమ్మిదో తరగతి విద్యార్థిని పి.జ్యోతి ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ కె.ప్రవీణ తెలిపారు. ఇటీవల అన్నమయ్య జిల్లా చిట్వేల్లో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో అండర్–14 విభాగంలో తమ పాఠశాల విద్యార్థినులు అసమాన ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. 2024 జనవరి 28న రాజంపేటలో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున జ్యోతి పాల్గొననున్నట్టు తెలిపారు. జ్యోతిని, పీఈటీ నాగమల్లేశ్వరిని మంగళవారం పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.
వెనుకబడిన విద్యార్థుల
అభివృద్ధికి ప్రత్యేక కృషి
ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, జూనియర్ కళాశాలల విద్యార్థుల్లో వెనుకబడిన వారిని గుర్తించి పురోభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని ఏలూరు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి బి.ప్రభాకరరావు అన్నారు. మంగళవారం స్థానిక వృత్తి విద్యాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ, ఎయిడెడ్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో ఆయన సమావేశం నిర్వహించారు. వెనుకబడిన విద్యార్థుల యూనిట్, త్రైమాసిక పరీక్ష ఫలితాలు గుర్తించాలని, గత విద్యా సంవత్సరంలో ఫెయిల్ అయిన వారినీ గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులయ్యేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహించే నాలుగో యూనిట్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, అకడమిక్ ఆర్గనైజర్ ప్రకారం పాఠ్యాంశాలు బోధించాలని అన్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో విద్యార్థి ప్రగతిపై దృష్టి సారించి పబ్లిక్, ప్రాక్టికల్, థియర్ పరీక్షల్లో ఉత్తీర్ణతకు తగుచర్యలు తీసుకోవాలన్నారు.