ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు అన్నిరకాలుగా అండగా ఉంటుందని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక సారథి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఏలూరు జిల్లా ప్రథమ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే మీడియా రంగం పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ జర్నలిస్టుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే తన ఎన్నికల హామీల్లో భాగంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ఇటీవల జీఓ విడుదల చేశారని గుర్తుచేశారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సమావేశంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఈడీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాం, వైఎస్సార్సీపీ నాయకులు ఘంటా ప్రసాదరావు, ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ, సామ్నా తదితర సంస్థల నేతలు ఐవీ సుబ్బారావు, చందు జనార్దన్, డి.సోమసుందర్, నల్లి ధర్మారావు, మాణిక్యరావు కాగిత తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గాల ఎన్నిక
అనంతరం ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా నూతన కారవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నూతన అధ్యక్షుడిగా కేపీకే కిషోర్, కార్యదర్శిగా వీకే కిషోర్, ఉపాధ్యక్షులుగా వి.మధుసూర్యప్రకాష్, ఎస్కే ఆజాద్, ఎన్.మధుసూదనబాబు, ఉర్ల శ్రీనివాస్ తదితరులు ఎన్నికయ్యారు. అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా ఏలూరు జిల్లా అధ్యక్షునిగా ఎస్.సంజయ్కుమార్, కార్యదర్శిగా ఎస్.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా దేవరపు విజయ్కుమార్, బి.మురళి, డి.శ్రీధర్, ఎ.వినయ్కుమార్ ఎన్నికయ్యారు. చిన్న పత్రికల అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా సోడిశెట్టి శాంతకుమార్, ప్రధాన కార్యదర్శిగా కురెళ్ళ కిషోర్, గౌరవాధ్యక్షునిగా ములకల విశ్వగంగాధర్, గౌరవ సలహాదారుగా ద్రోణంరాజు వెంకటరమణ, ఉపాధ్యక్షునిగా ఎంవీవీ సత్యనారాయణ, కార్యదర్శిగా బండారు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.